ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా సినీ పెద్దలు

author img

By

Published : Apr 13, 2021, 9:32 PM IST

మనసున్న మారాజులు స్పందించడంతో.. ఓ పేద కుటుంబంలో తెలుగు నూతన సంవత్సరాది నాడు వెలుగులు విరబూశాయి. జన్మనిచ్చిన వారి సేవలో తరించాల్సిన తనయుడు.. మాతృమూర్తితోనే సపర్యలు చేయించుకుంటున్న దురావస్థ చూసి... మానవతావాదులు ఆపన్నహస్తం అందించారు. ఈటీవీ భారత్​ కథనానికి.. ఓ సినీ నిర్మాత, దర్శకుడు స్పందించారు. నల్గొండ జిల్లాలోని బాధితుడి ఇంటికి వెళ్లి.. తామున్నామంటూ వారికి భరోసానిచ్చారు.

Response to etv Bharat article
బాధితుడికి అండగా సినీ పెద్దలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో మాయరోగంతో మంచానికే పరిమితమైన ఓ బాధితుడికి సాంత్వన లభించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి.. మంచానికే పరిమితమైన వైనంపై గతేడాది సెప్టెంబర్ 11న ఈటీవీ భారత్​ ప్రసారం చేసిన కండర క్షీణత వ్యాధి.. కుటుంబాన్ని కాటేసింది! కథనానికి స్పందన లభించింది. సినీ పెద్దలు.. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, దర్శకుడు కె.అజయ్ కుమార్​లు బాధితుడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

2020 సెప్టెంబరులో ఈటీవీ భారత్​ కథనం..

నేరడకు చెందిన జంపాల గోపాల్.. మస్కులర్ డిస్ట్రోఫీ బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు, చేతులు ఆడని దుర్భర స్థితికి చేరుకున్నాడు. చికిత్స కోసం రూ. 8 లక్షలు ఖర్చు చేసి.. ఎన్ని దవాఖానాలు తిరిగినా ఫలితం దక్కలేదు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోగా.. వైద్యాన్ని నిలిపివేశారు. ఆ కొద్ది రోజులకే.. మూత్ర పిండాల వ్యాధితో గోపాల్ తండ్రి కన్ను మూశాడు. ఇద్దరు పిల్లలతో పుట్టింట్లోనే ఉంటున్న చెల్లెలితో కుటుంబ పరిస్థితి మరింత భారమైంది. వారి దీనగాథపై 2020 సెప్టెంబరులో.. ఈటీవీ భారత్​ కథనం ప్రసారం చేసింది.

పెద్ద మనసున్న సినీ పెద్దలు..

విషయం తెలుసుకున్న బిచ్చగాడు చిత్ర నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, మాతృదేవోభవ చిత్ర దర్శకుడు కె.అజయ్ కుమార్​ ఈటీవీ భారత్​ ప్రతినిధితో కలిసి బాధితుడి ఇంటికి స్వయంగా వెళ్లారు. వారికి రూ. లక్షను ఆర్థిక సాయంగా అందించారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నిరుపేద ఇంటికి రావడంతో.. గోపాల్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కన్నీళ్లు ఆగలేదు. పెద్ద మనసుతో.. ఆపదలో ఉన్న తమను ఆదుకునేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. బాధితుడు ఆనందంతో పొంగిపోయాడు.

వీల్​ ఛైర్​ కొంటాను..

ఈటీవీ భారత్​ కథనం ప్రసారమైనప్పటి నుంచి బాధితులకు దాతల నుంచి రూ. లక్షా 60 వేలు అందగా.. ప్రస్తుతం అందిన డబ్బుతో 'పవర్ వీల్ ఛైర్' కొనుక్కుంటానని గోపాల్ చెబుతున్నాడు. బాధితులు, దాతలు ఈటీవీ భారత్​కు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత కథనం: కండర క్షీణత వ్యాధి.. కుటుంబాన్ని కాటేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.