ETV Bharat / state

ఈనెల 13న అదృశ్యమైన ప్రేమజంట.. దొరికిన ఆచూకీ.. కానీ?

author img

By

Published : Feb 16, 2023, 10:10 AM IST

Updated : Feb 16, 2023, 2:23 PM IST

lovers suicide
ప్రేమ జంట ఆత్మహత్య

Lovers Committed Suicide in Medak : ఈనెల 13న మెదక్ జిల్లాలో ఓ వివాహిత, మరో యువకుడు కనిపించకుండా పోయారు. వారిని వెతుకుతూ వెళ్లిన కుటుంబ సభ్యులకు నార్సింగి శివారులోని ఓ చెరువు వద్ద చెప్పులు, బైకు కనిపించాయి. వాళ్లిద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారేమోనన్న అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం చెరువులో గాలింపు మొదలు పెట్టారు. మూడ్రోజుల తర్వాత ఇవాళ ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.

Lovers Committed Suicide in Medak : ఒక యువతి, యువకుడు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం కాస్తా పెద్దలకు తెలిసింది. అబ్బాయిది వేరే మతం కావడంతో వాళ్ల ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. వేరే సంబంధం చూసి ఆ యువతికి పెళ్లి చేసేశారు. వేరే వ్యక్తితో పెళ్లయినా.. ప్రేమించిన వాడిని మరిచిపోలేక.. అతనే తన జీవితమని భావించి ప్రేమించిన వాడి వద్దకు వెళ్లింది ఆ యువతి. అది కూడా ప్రేమికుల దినోత్సవాలు జరుపుకుంటున్న రోజునే కావడం విశేషం. అప్పటి నుంచి ఇద్దరు కనిపించకుండా పోయారు. చివరకు ఇవాళ ఓ చెరువులో నిర్జీవంగా తేలియాడారు. కలిసి బతకలేనప్పుడు కనీసం కలిసి చనిపోదామనుకున్నారు కావొచ్చు.. విడిచి ఉండలేక.. కలిసి బతకలేక మనస్తాపానికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మెదక్​ జిల్లా నార్సింగి మండలంలో చోటుచేసుకుంది.

మృతి చెందిన ప్రేమికులు ఖలీల్​, కల్పన
మృతి చెందిన ప్రేమికులు ఖలీల్​, కల్పన

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మండలానికి చెందిన కల్పన, అదే గ్రామానికి చెందిన ఖలీల్ ప్రేమించుకున్నారు. యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించకపోగా, మూడు నెలల క్రితం కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన మరో వ్యక్తితో కల్పనకు వివాహం జరిపించారు. కొద్ది రోజుల క్రితం కల్పన నార్సింగిలోని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఆమె నార్సింగిలో ఆర్టీసీ బస్సు ఎక్కి రామాయంపేటలో దిగినట్టు, ఆ తర్వాత ఖలీల్​తో కలిసి బైక్​ మీద రామాయంపేట పట్టణంలో తిరిగినట్లు సీసీ కెమెరా పుటేజీలో కనిపించింది.

ఆ పుటేజ్​ ఆధారంగా వారి జాడను పోలీసులు కనుగొన్నారు. నార్సింగి చెరువు వద్ద వారి చెప్పులు, బైక్​ను గుర్తించారు. దీంతో పోలీసులు గజఈతగాళ్లను రప్పించి.. చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా లభ్యంకాలేదు. దీంతో వారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మూడు రోజులు తర్వాత వారి మృతదేహాలు చెరువు లోపలి నుంచి పైకి తేలాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 16, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.