ETV Bharat / state

Ramanpadu Project Problems : దయనీయంగా రామన్​పాడు ప్రాజెక్టు.. పిచ్చిమొక్కలతో ప్రశ్నార్థకంగా భద్రత

author img

By

Published : Aug 18, 2023, 2:46 PM IST

Mahabubnagar Irrigation Project Issues
Ramanpadu Dam Latest News

Ramanpadu Project Problems: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని, తాగునీటిని అందించే జలప్రదాయని రామన్‌పాడు జలాశయ నిర్వహణ అధ్వానంగా తయారైంది. రెండు క్రస్ట్ గేట్లు పనిచేయటం లేదు. గేట్ల వద్ద నీటి లీకేజీలు కొనసాగుతున్నాయి. ఆనకట్టలపై పిచ్చిమొక్కలు మొలిచి.. భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఇక ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు జమ్ముతో నిండిపోయి దయనీయంగా మారాయి. నీటి ఒత్తిడిని తట్టుకోలేక తూముల షట్టర్లు తరుచూ మొరాయిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది

Ramanpadu Project Problems : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటి జలప్రదాయని రామన్​పాడు జలాశయం. వనపర్తి జిల్లాలోని ఊకచెట్టువాగుపై 1972లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. వాగులో ప్రవహించే వరదనీటి ఆధారంగా కుడి కాలువ ద్వారా ఆత్మకూరు మండలంలోని 1738 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా మదనాపురం, కొత్తకోట, పెబ్బేర్ మండలాల పరిధిలోని 3432 ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

అనంతరం, జూరాల ప్రాజెక్టు(Priyadarshini Jurala Project) ప్రధాన ఎడమ కాలువ, బీమా ఎత్తిపోతల పథకం సమాంతర కాల్వలకు దీనిని అనుసంధానం చేశారు. జూరాల నుంచి రామన్‌పాడు జలాశయాన్ని ఏటా నింపుతుంటారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని పంపిణీ చేస్తారు. తాగునీటి అవసరాల కోసం ఈ జలాశయంలో నీటిని వినియోగిస్తారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha Scheme) నుంచి తాగునీరు అందకపోతే ప్రత్యామ్నాయ మార్గం రామన్‌పాడు జలాశయమే.

Ramanpadu Project Crust Gates Issue : ఇంతటి ప్రాధాన్యం ఉన్న రామన్‌పాడు జలాశయం నిర్వహణ అధ్వానంగా మారింది. పదేళ్లుగా 2 క్రస్ట్ గేట్లు పనిచేయడం లేదు. గేట్ల నుంచి నీరు దిగువకు లీకవుతోంది. వేసవికాలంలో రబ్బర్ సీల్స్ మార్చడం, లూబ్రికేషన్ చేసే పనులు చేయడం లేదు. జలాశయం కరకట్టలపై ముళ్ల పొదలు పెరిగాయి. విద్యుత్తు దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ అంధకారం నెలకొంటోంది. ముళ్లపొదల ప్రభావంతో కరకట్ట వద్ద లీకేజీలు ఏర్పడుతున్నాయి. మదనాపురం నుంచి ఆత్మకూరు వెళ్లే రహదారి మూసుకుపోతే రామన్‌పాడు నుంచి ఆత్మకూరు వెళ్లే మార్గమే కీలకం కాగా.. ముళ్లపొదలతో నిండి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది.

డ్యామ్ కట్టినప్పటినుంచి.. ఇప్పటి వరకు నీరు లీకవుతూనే ఉంది. ఎప్పుడు చూసినా అది అంతే. ఎవరు పట్టించుకుంటున్నారు అసలు.. ఆ లీకేజీలు వల్ల దాదాపు 20 నుంచి 30 మోటార్ల నీరు లీకై వృథాగా పోతుంది. ఎలా చూసినా ఒక చిన్న కాలువను తలపించేలా నీరు ప్రవహిస్తోంది. డ్యామ్​పై విపరీతంగా ముళ్లపొదలు పెరిగి.. కనీసం మా ప్రయాణానికి కూడా దారి లేకుండా, ఇబ్బందిగా మారింది. దాని నిర్వహణ కార్యక్రమాలు చూసే నాథుడే లేడు. - వాకాటి తిరుపతయ్య, రైతు

అధికారుల అలసత్వానికి అన్నదాతల్లో గుబులు : నీటిపారుదలశాఖ అధికారులు ఏటా వేసవిలో విధిగా చేపట్టాల్సిన కనీస నిర్వహణ చేపట్టడం లేదు. ప్రాజెక్టు పరిసరాలతో పాటు, ఆయకట్టు కాలువలకు మరమ్మతులు జరగాలి. అవి లేక జలాశయం పరిసరాలతో పాటు ఆయకట్టు కాలువల దుస్థితి దయనీయంగా మారింది. కుడి, ఎడమ కాలువల తూములు వద్ద షట్టర్లకు మరమ్మతులు చేపట్టక సాగునీరు వృథాగా పోతోంది.

జలశయం నిర్మించిన నాటి రోజుల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఏర్పాటు చేసిన తూముల షట్టర్లు నీటి ఒత్తిడిని తట్టుకోలేక తరుచూ మొరాయిస్తున్నాయి. కాలువల మొదట్లో ముళ్లపొదలు, జమ్ము బాగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జలాశయం కుడి విభాగంలో ఏర్పాటు చేసిన స్లూయీస్ మూసివేయడం వల్ల వాగు ద్వారా కొట్టుకువస్తున్న ఇసుకతో పూడిక పెరుగుతోంది. సంవత్సరం పొడవునా జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం నిల్వ చేయడం, మరమ్మతు పనులు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని, సమకూరిన నిధుల మేరకు పనులు చేయిస్తున్నామనీ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా.. గతేడాది వేసవిలో నిర్వహణ నిధులే రాలేదు. ప్రధాన కాల్వల్లో పెరిగిన జమ్ము, ముళ్లపొదల తొలగింపు, పూడిక పనులు చేపట్టాలని వేసవికి ముందే ఆయా మండలాల ఉపాధిహామీ పథకం(Mahatma Gandhi National
Rural Employment Guarantee Scheme) అధికారులను కోరినా, పంట కాల్వవలు తప్ప డిస్ట్రిబ్యూటరీల్లో పనులు చేపట్టేందుకు నిబంధనలు అనుమతించని పరిస్థితి నెలకొంది. ఉన్న సిబ్బందితోనైనా నిర్వహణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

సరళసాగర్​ ప్రాజెక్టుకు జలకళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.