ETV Bharat / state

ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం

author img

By

Published : Nov 6, 2020, 8:20 AM IST

ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం
ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం

ఇంటి పెద్ద దిక్కు అకాల మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వయసు మళ్లిన తల్లిదండ్రులు, అనారోగ్యంతో బాధపడే భార్య, ఇద్దరు చిన్నపిల్లలు గూడు లేక నిర్మాణంలో ఉన్న కులసంఘం భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. చలిలో గజగజ వణుకుతూ పడుకుంటున్నారు. కూలీ చేసుకుంటేనే పూటగడిచే పరిస్థితి నెలకొన్న ఆ కుటుంబం సాయంకోసం అర్థిస్తోంది.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన తిరుపతి అనారోగ్యంతో గత నెల 18న హఠాత్తుగా చనిపోయాడు. రెక్కల కష్టం మీద జీవనం సాగించే... ఆ కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. అద్దెకు కూడా ఇల్లు లభించకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకుంటున్నారు. ప్రహరీ గోడ లేని భవనంలో వృద్ధులు, పిల్లలు చలికి వణికుతున్నారు. అప్పుచేసి ఇల్లు కడుతుండగా... తిరుపతి చనిపోవడంతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. పిల్లలు, అనారోగ్యం, వృద్ధాప్యంతో బతుకు భారమైందని తిరుపతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు.

తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పిల్లలకు అండగా ఉన్నా.... ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కోడలి ఆరోగ్యం సైతం అంతంత మాత్రమేనని... ఇప్పటికే మూడు శస్త్రచికిత్సలయ్యాయని తెలిపారు. అయినా కుటుంబాన్ని పోషించుకోవడానికి వయస్సు పైబడిన 75 ఏళ్ల అత్తతో కలిసి కూలీ పనులు చేస్తోందన్నాడు. ఇద్దరు చిన్నారులను ఎలా చదివించాలో అర్ధం కావడం లేదని వాపోయాడు.

బాల్యంలో ఆనందంగా ఆటలాడుకోవల్సిన తాము ఎందుకు ఇల్లు వదిలి పెట్టాల్సి వచ్చిందో ఆ చిన్నారులకు తెలియదు. లోకం తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన చిన్నారులు... అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థంకాదు... చలికి గజగజ వణికిపోతూ అరుగులపైనే పడుకోవాల్సిన దుస్థితి. పక్కనే గ్యాస్‌స్టౌ ఉన్నా... కట్టెలపొయ్యిపై వంట చేస్తూ కనిపించడం స్థానికుల హృదయాలను ద్రవింప చేస్తోంది. తనకు 3 శస్త్రచికిత్సలు కావడం వల్ల కూలీ చేసే పరిస్థితి లేదని వాపోయింది. ప్రభుత్వం ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఇంటి పెద్ద చనిపోవడం వల్ల వీధిన పడ్డ కుటుంబానికి తమ వంతు సాయం చేస్తున్నా... వారి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు దయార్ధ హృదయులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకువచ్చి రెండుపడక గదుల ఇల్లు కేటాయించాలంటున్నారు. పిల్లలను ప్రభుత్వ వసతి గృహంలో చదివించాలని స్థానికులు కోరుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొత్త సంపదను సృష్టిస్తోన్న చేపలు, రొయ్యల పెంపకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.