ETV Bharat / state

MLC Elections Polling 2021 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

author img

By

Published : Dec 10, 2021, 5:01 AM IST

Updated : Dec 10, 2021, 8:00 AM IST

MLC Elections
MLC Elections

MLC Elections Polling 2021 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన, భద్రతా సన్నద్ధత సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

MLC Elections Polling 2021: రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు సహా వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోస్థానానికి, కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 5వేల 326 ఓటర్లు 37 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత..

Local Body MLC Elections Polling : ఆదిలాబాద్‌లో తెరాస నుంచి దండె విఠల్ బరిలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 937 మంది ఓటర్లు ఉండగా.. 8 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతం కావడంతో.. భద్రతాపరంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. 1,271 మంది ప్రజా ప్రతినిధులు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. 3 డివిజన్ల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్‌ జిల్లాలో ఒక స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నారు. తెరాస అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. 1026మంది ఓటర్లు ఉండగా.. 9 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 14న ఓట్ల లెక్కింపు..

Telangana Local Body MLC Elections : ఖమ్మం జిల్లాలో తెరాస తరపున తాతా మధు, కాంగ్రెస్‌ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 768 మంది ఓటర్లు ఉండగా 4 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెరాసకు చెందిన భాను ప్రసాదరావు, ఎల్​.రమణతో పాటు మరో 8 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. తెరాసకే చెందిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్‌లో 1,324 మంది ఓటర్లు ఉండగా 10 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 14న లెక్కింపు జరగనుంది.

"కొంత మంది క్యాంపులకు వెళ్లారని ఫిర్యాదులు వచ్చాయి. మన జిల్లా అధికారులు దానిపై దర్యాప్తు చేశారు. అయితే ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ద్వారా ప్రక్రియను రికార్డ్‌ చేస్తాం."

-శశాంక్‌ గోయల్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఇదీ చదవండి : Palam Air base: రావత్​ పార్థివదేహానికి మోదీ, ప్రముఖుల నివాళి

Last Updated :Dec 10, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.