ETV Bharat / state

గ్రామరాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమే..: వెంకయ్యనాయుడు

author img

By

Published : Jul 11, 2021, 9:31 PM IST

vice president, venkaiah nayudu
వెంకయ్యనాయుడు

గ్రామరాజ్యంలేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్మాగాంధీ మాటల స్ఫూర్తితో.. గ్రామీణాభివృద్ధి, రైతు స్వావలంబనతోపాటు పల్లెల్లో సుపరిపాలన జరగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. 'పల్లెకు పట్టాభిషేకం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ వైపు కూడా మళ్లించాలని సూచించారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు యలమంచిలి శివాజీ రచించిన 'పల్లెకు పట్టాభిషేకం' పుస్తకాన్ని హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తక తొలిప్రతిని రచయిత అల్లుడు సునీల్ కుమార్​కు అందజేశారు. గ్రామరాజ్యంలేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్మాగాంధీ మాటల స్ఫూర్తితో.. గ్రామీణాభివృద్ధి, రైతు స్వావలంబనతోపాటు పల్లెల్లో సుపరిపాలన జరగాలని ఆకాంక్షించారు. రైతులకు కావాల్సింది ఉచిత పథకాలు కాదని.. శాశ్వత పరిష్కార మార్గాలని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. పల్లెలకు, పట్టణాలకు మధ్య అంతరం పెరుగుతోందని.. గ్రామాలను పట్టణాలకు ఆహారాన్ని అందించే కర్మాగారాలుగానే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

ఈ పరిస్థితి మారి పల్లెల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... పండుగలకు సొంతూరు వెళ్లి వాటి అభివృద్ధికి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పల్లె పరిస్థితులు, వ్యవసాయం, పంటలు, రైతుల సమస్యలు, పరిష్కార మార్గాలు వంటి అంశాలతో పుస్తకాన్ని అద్భుతంగా రచించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. కరోనా సంక్షోభంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా దేశంలో వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపు చేసిన ఘనత మన రైతులదేనని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధరను అందించటంతోపాటు సకాలంలో, సరసమైన విధంగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్​పై అవగాహన కల్పించాలి

పంటల రవాణాపై ఆంక్షలు తొలగించి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు నిల్వ సామర్థ్యం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో రైతులకు మెలకువలు నేర్పించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివేదికలను పరిశీలిస్తే... కేవలం వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు మాత్రమే సమస్యలు ఎదుర్కొన్నారని... అనుబంధ రంగాల మీద దృష్టి సారించిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకాలు కాదని.. సాగు నీరు, రవాణా, నాణ్యమైన విద్యుత్ వంటి మౌళికసదుపాయలు కల్పించాలన్నారు. తాత్కాలిక ప్రయోజన పథకాలతో దీర్ఘకాలిక, శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత యలమంచిలి శివాజీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ, రైతునేస్తం పబ్లిషర్, పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పల్లెకు పట్టాభిషేకం చేయాల్సిందే. గ్రామీణ భారతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, గ్రామాలను మరింత నివాసయోగ్యంగా చేయడం అవసరం. లేకుంటే దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. ప్రజా జీవనంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ ఆ ప్రాధాన్యత ప్రజావేదికలపై, పత్రికల్లో, పార్లమెంట్, అసెంబ్లీ​లో తక్కువగా కనబడుతోంది.

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

'పల్లెకు పట్టాభిషేకం' పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

ఇదీ చదవండి: Rain Alert: రాష్ట్రంపై అల్పపీడన ప్రభావమెంత? వాతావరణ శాఖ ఏం చెబుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.