జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే తెరాస ప్రభుత్వం రూ. పదివేలు పంపిణీ చేసిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. దీనిపై లోకాయుక్తలో పిటిషన్ వేశామని.. సహాయనిధిలో జరిగిన అక్రమాలపై పోరాడుతామని స్పష్టం చేశారు. వరద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
"వరద బాధితుల సహాయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. వారికి కనీసం ఆహారం, నీటి పంపిణీ కూడా చేయలేదు. ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తిన తర్వాత.. తన వైఖరిని మార్చుకునే ప్రయత్నం చేసింది. అప్పటికీ నష్టం ఎక్కడ జరిగిందో బేరీజు వేయడానికి కమిటీ వేయలేదు. బేరీజు తర్వాత నష్ట పరిహారం ఎంత ఇవ్వాలని నిర్ణయించాలి. అదేమి లేకుండా విమర్శలు తట్టుకోలేక మొక్కుబడిగా రూ. 10 వేలు నష్టపరిహారం అని ప్రకటించింది. అలా చేయడం సరైంది కాదు. అది కూడా తమకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడే కార్యకర్తలకే డబ్బు ఇచ్చారే తప్పా నిజమైన బాధితులకు పరిహారం అందలేదు. మేము ఇప్పటికే ఈ విషయంపై లోకాయుక్తలో పిటిషన్ వేశాం. ఈ అక్రమాలపై న్యాయం జరిగే వరకూ పోరాడుతాం."
-కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇదీ చదవండి: గ్రేటర్లో తెజసను గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ రద్దుచేస్తాం: కోదండరాం