సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు

సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు
Telangana Election Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాల జోరు కొనసాగుతోంది. సమయం దగ్గర పడుతుండడంతో.. మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరిస్తూ.. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఊరూవాడ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
Telangana Election Campaign 2023 : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఎంఐఎం అధినేత అసదుద్ధిన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గ ఎంఐఎం అభ్యర్థి కౌసర్ మొయినుద్దీన్ ప్రచారం(Election Campaign) ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులను కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగేళ్లలో పేద ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ.. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డికి మద్దతుగా.. గోవా బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షేట్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం వేగవంతం చేశారు. రంగారెడి జిల్లా యాచారంలో ప్రచారం నిర్వహించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి.. ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు.
BRS Election Campaign 2023 : పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రెండవ బొగ్గు గని ఆవరణలో ఉన్న కార్మికులను కలిసిన బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్.. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాఘవపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గంగాధరలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం.. విస్తృతంగా ప్రచారం చేశారు. హుజూరాబాద్లో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కాజీపేట-2 గనిలో ప్రచారం నిర్వహించిన చెన్నూరు బీఆర్ఎస్(BRS) అభ్యర్థి బాల్క సుమన్.. కేసీఆర్ పాలనే సింగరేణికి శ్రీరామరక్ష అన్నారు. మందమర్రిలో కేసీఆర్ను ఓడించాలంటూ ఉస్మానియా విద్యార్థులు ప్రచారం చేపట్టారు. వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్.. వాకర్స్ను కలిసి ఓటు వేలాంటూ.. ప్రచారం నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి.. ఆదరించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Congress Election Campaign in Telangana 2023 : ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సత్తుపల్లిలో ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య.. అధికారంలోకి వస్తే జనవరి నాటికి దళితబంధు పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరులో ప్రచారం నిర్వహించిన కందాల ఉపేందర్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ప్రచారం నిర్వహించిన.. జైవీర్ కాంగ్రెస్ హామీలనే బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. సూర్యపేట బీజేపీ అభ్యర్థి శ్రీలతరెడ్డి అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు.
BJP Election Campaign in Telangana 2023 : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి కుమార్తెలు.. తండ్రి గెలుపు కోసం గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తి వేస్తామని.. సంగారెడ్డి కాంగ్రెస్(Congress) అభ్యర్థి జగ్గారెడ్డి తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి విస్తృత ప్రచారం చేపట్టారు.
