ETV Bharat / state

REGISTRATION DEPT INCOME: కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ

author img

By

Published : May 26, 2022, 4:57 AM IST

Updated : May 26, 2022, 6:44 AM IST

REGISTRATION DEPT INCOME: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడులు ఆశించిన మేరకు పెరిగాయి. నెలకు రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదేస్థాయిలో రాబడులు వచ్చినట్లయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.

స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ

REGISTRATION DEPT INCOME: రాష్ట్రంలో మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా రెట్టింపు అయ్యింది. గతంలో రోజుకు రూ.20 నుంచి రూ.25 కోట్లు మేర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అది ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యింది. వాస్తవానికి గత ఆర్థిక ఏడాదిలో మొదటి మూడు నెలలు చాలా తక్కువ రిజిస్ట్రేషన్లు కావడంతో రాబడి కూడా బాగా తక్కువ వచ్చింది.

ఆ తరువాత మిగిలిన తొమ్మిది నెలలు రాబడులు అనూహ్యంగా పెరిగాయి. చివరి నాలుగు నెలలు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అయితే నెలకు రూ.12వందల కోట్లకు తక్కువ లేకుండా ఆదాయం వచ్చింది. మార్చి నెలలో అయితే ఏకంగా రూ. 1501 కోట్లు రాబడులు వచ్చాయి. దీంతో 2021-22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యం రూ.12,600 కోట్లుకాగా 19.17లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి రూ.12,373 కోట్లు మేర ఆదాయం వచ్చింది.

అంటే 98.98శాతం లక్ష్యం పూర్తి చేసి, నెలకు సగటున రూ.1,030 కోట్లు ఆదాయం వచ్చినట్లయింది. అంతకు ముందు ఏడాదిల్లో వచ్చిన ఆదాయాలతో పోలిస్తే తాజాగా రూ.30కోట్లకు తక్కువ లేకుండా రూ.50 కోట్లు అంతకు మించి రాబడి వస్తోంది. అయితే గత మార్చిలో ఏకంగా రూ.1501 కోట్లు రాబడి వచ్చింది. అంటే రోజుకు రూ.50కోట్లు తక్కువ లేకుండా రాబడి వచ్చింది.

ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.15,600 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మొత్తం అంతకు ముందు ఆర్థిక ఏడాది కంటే 20శాతం అధికంగా రూ.15,600 కోట్లుగా లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రభుత్వం. అంటే ప్రతి నెల రూ.1,300 కోట్లు రాబడి వచ్చినట్లయితే నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఏప్రిల్‌, మే ఈ రెండు నెలల్లో గడిచిన 55 రోజుల్లో 1,91,545 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.1,877 కోట్లు... 7.82లక్షల మేర ఈసీలు జారీ చేయడం ద్వారా రూ.39.04 కోట్లు వచ్చాయి.15వేలకుపైగా వివాహాల రిజిస్ట్రేషన్లు కావడం ద్వారా దాదాపు కోటి రూపాయల ఆదాయం వచ్చినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే ఈ 55 రోజుల్లో రూ.1918 కోట్లు మేర రాబడి వచ్చింది.

ఏప్రిల్‌ నెలలో 1,06,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.1064 కోట్లు రాబడి వచ్చింది. మే నెలలో 25వ తేదీ వరకు దాదాపు 86వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కావడం ద్వారా రూ.814కోట్ల మేర రాబడి వచ్చింది. సొసైటీల రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా ఆదాయాల ద్వారా కూడా రాబడులు వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో సాధారణంగా కొంత మందకొడిగా ఉన్నా ఈ 55 రోజుల్లోనే దాదాపు రూ.2వేల కోట్లు రాబడి వచ్చింది. రాను రాను ఆదాయం మరింత పెరుగుతుందని తద్వారా ...ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రూ.15,600 కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ

ఇదీ చదవండి: రేపు బెంగళూరుకు సీఎం కేసీఆర్​.. ప్రధాని పర్యటనకు మరోసారి దూరం

'పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్' లేకుండానే లండ‌న్ వెళ్లిన రాహుల్‌?

Last Updated : May 26, 2022, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.