ETV Bharat / state

Oxygen: ఆక్సిజన్ పై దృష్టి... ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు సరఫరా

author img

By

Published : Jun 8, 2021, 4:10 PM IST

రెండో దశ కరోనా ఉద్ధృతి వేగంగా విస్తరిస్తుండడంతో ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రాణవాయువు అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తుంది. కరోనాతో ఏ ఒక్క రోగి మరణించవద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆక్సిజన్ ను సమకూర్చుకునే పనిలో పడింది. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గడ్, పశ్చిమ బంగ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను రాష్ట్రానికి తరలిస్తున్నారు.

oxygen

రాష్ట్రం ఆక్సిజన్ నిల్వలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇతర రాష్ట్రాల్లో ప్రాణవాయువు కొరత వల్ల కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పొరుగున ఉన్న రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాన ఖాళీ కంటైనర్లను పంపిస్తున్నారు. కంటైనర్లలో ఆక్సిజన్ నింపుకున్న తర్వాత రైలు, రోడ్డు మార్గాల ద్వారా తిరిగి రాష్ట్రానికి తరలిస్తున్నారు.

51 విమానాల ద్వారా 118 ఖాళీ ట్యాంకర్లను తీసుకెళ్లారు. 7 రైళ్ల ద్వారా 36 ట్యాంకర్లు, రోడ్డు మార్గం ద్వారా 424 ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా 97 ట్యాంకర్లు, 13 రైళ్లలో వాటికి బిగించబడి ఉన్న 66 ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా మరో 26 ట్యాంకర్లను తరలించారు. ఈ విధంగా మొత్తం 767 ట్యాంకర్లతో 14,043.86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను రాష్ట్రానికి తరలించారు. ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకెళ్లి తీసుకురావడంలో రవాణాశాఖ కీలక పాత్ర పోషిస్తోంది.

శాఖదే బాధ్యత…

ట్యాంకర్ల సేకరణ, అవి వచ్చేప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా... ఈ శాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగ తదితర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను తీసుకొచ్చారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకు ఆక్సిజన్ ను రోడ్డు మార్గంలో తీసుకువచ్చినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.

కేవలం రైళ్ల ద్వారా ఈనెల 7 వరకు 5వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రానికి 2,605 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2,440 మెట్రిక్‌ టన్నుల చేసినట్లు ద.మ. రైల్వే తెలిపింది. ఇప్పటి వరకు 66 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 293 ట్యాంకర్లలో 5,045 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీసుకొచ్చింది.

వివిధ రాష్ట్రాల నుంచి…

ఒడిశా నుంచి 2,828 మెట్రిక్‌ టన్నులు, జార్ఖండ్‌ నుంచి 1,208 మెట్రిక్‌ టన్నులు, గుజరాత్‌ నుంచి 929 మెట్రిక్‌ టన్నులు, పశ్చిమ బంగ నుంచి 80 మెట్రిక్‌ టన్నుల సరఫరా అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణపట్నం పోర్టు, తాడిపత్రి ప్రాంతాలకు 2,440 మెట్రిక్‌ టన్నులు, తెలంగాణలోని సనత్‌నగర్‌ గూడ్స్‌ కాంప్లెక్స్‌కు 2,605 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ ను రైల్వే సరఫరా చేసింది.

ఈ రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆక్సిజన్ సరఫరాను రవాణా, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైలు ఎప్పుడు బయలుదేరింది. తిరిగి ఎప్పుడు చేరుకుంటుంది. మధ్యలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా... వాటి పరిష్కారాలు మొత్తం ఈ శాఖ అధికారులే చూసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.