ETV Bharat / state

రేపు జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్

author img

By

Published : Feb 10, 2023, 11:20 AM IST

IPS Dikshant Samaroh
IPS Dikshant Samaroh

పోలీస్ శాఖలో నూతన ఐపీఎస్​లు చేరనున్నారు. 74వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్​లు జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు. ఐదుగురిని తెలంగాణ కేడర్‌కు, ఇద్దరిని ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించారు. రేపు ఐపీఎస్​ల దీక్షాంత్ సమారోహ్ జరగనుండగా... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హజరుకానున్నారు.

హైదరాబాద్ సర్ధార్ వల్లభ్‌బాయిపటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 74వ బ్యాచ్‌శిక్షణ విజయవంతంగా పూర్తైంది. కరోనా కారణంగా అక్టోబర్‌లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌... నాలుగు నెలలు ఆలస్యమైంది. 74వ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా... వారిలో 41 మంది మహిళలు ఉన్నారు. గతంతో పోలిస్తే మహిళా ఐపీఎస్​ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 195 మందిలో166 మంది ఐపీఎస్​లు కాగా మిగిలిన 29 మంది విదేశీక్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్‌, భూటాన్‌, మాల్‌దీవులు, మారిషస్ దేశాల క్యాడెట్లు శిక్షణ పొందా రు. ఐపీఎస్​లలో ఎక్కువగా ఇంజనీరింగ్ చేసిన వారే అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న 166 మందిలో ఇంజినీరింగ్ చదివినవారే 114 మంది ఉన్నారు.

కరోనా వల్ల 74వ బ్యాచ్‌ ఆలస్యం కావడంతో ఈసారి 75వ బ్యాచ్‌కి అకాడమీలో శిక్షణ సాగుతోంది. ప్రస్తుతం అకాడమీలో సుమారు 400 మంది క్యాడెట్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన కేరళకి చెందిన కేఎస్ షెహన్‌షా... పాసింగ్ అవుట్ పరేడ్‌ మాండర్‌గా వ్యవహరించనున్నారు. షెహన్‌షా సివిల్స్‌లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైనా... ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్‌ ఉద్యోగంపై ఇష్టంతో ఐపీఎస్ ఎంచుకున్నారు.

మెకానికల్ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత.. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొంది 8ఏళ్లలో 30 రాష్ట్ర, 14 జాతీయ పతకాలు సాధించారు. ఆ తర్వాత సీఐఎస్​ఎఫ్​లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా... ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ సర్వీస్‌లో డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ బ్యాచ్‌ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ఐపీఎస్​లను కేటాయించారు. సమాజంలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పారదోలేందుకు తమవంతు కృషి చేస్తామని క్యాడెట్లు పేర్కొన్నారు.

నేడు హైదరాబాద్‌ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా... రేపు సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగే ఐపీఎస్​ల పరేడ్‌లో పాల్గొననున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి భోజన విరామం తర్వాత దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.