ETV Bharat / state

Hyderabad Metro new Record : ఒక్కరోజు ప్రయాణికుల్లో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఎంతమంది ప్రయాణించారంటే..

author img

By

Published : Jul 4, 2023, 7:48 PM IST

hyderabad metro
hyderabad metro

Hyderabad Metro News : ఒకే రోజు ఐదు లక్షల పది వేలు మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి హైదరాబాద్​ మెట్రో రైలు సరికొత్త రికార్డుని సృష్టించింది. గురు పౌర్ణమి సందర్భంగా.. రద్దీ భారీగా పెరిగిందని మెట్రో అధికారులు అంచనావేస్తున్నారు.

Hyderabad Metro Latest news : హైదరాబాద్ మెట్రో రైలు 5 లక్షల ప్రయాణికుల సంఖ్యను దాటింది. సోమవారం ఒక్క రోజే హైదరాబాద్ మెట్రోలో 5లక్షల10 వేల మంది ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 40 కోట్ల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. శనివారం గ్రూప్ -4 పరీక్ష కోసం చాలామంది సొంత ఊర్లకు వెళ్లడం, ఆదివారం సెలవు తరువాత అందరూ తిరిగి రావడంతో పాటు సోమవారం గురుపౌర్ణమి కావడం కూడా మెట్రోకు కలిసొచ్చింది.

Hyderabad Metro Records : మెట్రో రైలును ప్రారంభించిన మొదటి రోజే 2 లక్షల మంది ప్రయాణించారు. ప్రస్తుతం సగటున సుమారు 4.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు లక్షలపైగా ప్రయాణించారు. మెట్రో రైలును ప్రవేశపెట్టినప్పటి నుంచి భాగ్యనగరంలో ట్రాఫిక్​ ఇబ్బందులు కొంత వరకు తగ్గాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని వేగంగా, సౌకర్యవంతంగా చేరుకుంటున్నారు. 50శాతం నుంచి 75శాతం ప్రయాణ సమయాన్ని మెట్రో ఆదా చేస్తుంది. ఇటీవలే విద్యార్థులకు మెట్రో పాస్​లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Hyderabad Metro Interduce Student Pass : ఇటీవల విద్యార్థుల సౌకర్యార్థం మెట్రో రైలుల్లో సూపర్​ సేవర్​ స్టూడెంట్​ పాస్​-2023ని జులై 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఈ పాస్​ని ఉపయోగించుకోవాలని కోరారు. 1998 ఏప్రిల్​ 1 తరువాత పుట్టిన ప్రతి ఒక్కరు ఈ పాస్​ పొందేందుకు అర్హులు అని తెలిపారు. ఈ పాస్​ కొనుగోలు చేసిన దగ్గర నుంచి 30 రోజులు చెల్లుబాటు అవుతుందని చెప్పారు.

అయితే మెట్రో రైలులో ప్యాసింజర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్లుగా కోచ్​ల సంఖ్య పెరగడం లేదు. దీనిపై ప్రయాణికులు పలుమార్లు తన నిరసన వ్యక్తం చేశారు. కేవలం మూడే కోచ్​లు ఉండడంతో ఉదయం, సాయంత్రం సమయం ఆఫీస్ వేళ్లలో రద్దీ విపరీతంగా పెరిగి సిటీ బస్సులను తలపిస్తున్నాయని పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా మెట్రో ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున.. కోచ్​ల సంఖ్యను కూడా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల మెట్రో స్టేషన్లలోని టాయిలెట్స్​కు కూడా ఛార్జీలు వసూల్ చేయడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.

Hyderabad Metro History : హైదరాబాద్​ మెట్రో రైలును 2017 నవంబర్​ 29న ప్రారంభించారు. 2017లో మొదటి దశ నాగోల్​ నుంచి అమీర్​పేట్​ మీదుగా మియాపూర్​ వరకు ప్రారంభించింది. అనంతరం రెండో దశగా ఎల్​బీ నగర్​ నుంచి అమీర్​పేట మార్గాన్ని అక్టోబర్​ 2018లో మొదలు పెట్టారు. అమీర్​పేట- హైటెక్​ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. జేబీఎస్​- ఎంజీబీఎస్​ రవాణా మార్గం 2020 ఫిబ్రవరి నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 69 కిలోమీటర్లులో అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రో ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా మెట్రో ప్రాజెక్ట్​ కారిడార్​-4ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం దాల్చింది. ఈ మార్గం రాయదుర్గం నుంచి శంషాబాద్​ విమానాశ్రయం వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్​ మెట్రో దేశంలో రెండో పెద్ద మెట్రోగా పేరుపొందింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.