ETV Bharat / state

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో రంగంలోకి దిగిన ఈడీ

author img

By

Published : Oct 8, 2021, 9:02 AM IST

Updated : Oct 8, 2021, 9:59 AM IST

telugu-academy-scam
తెలుగు అకాడమీ కుంభకోణం

08:58 October 08

మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేయనున్న ఈడీ అధికారులు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో సీసీఎస్​ పోలీసులు (Telugu Academy Case) కేసు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఈడీ రంగలోకి దిగింది. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్​ చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 

జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్‌ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్‌ సొసైటీకి మళ్లించారు. కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లను మళ్లించారు. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లను కొల్లగొట్టిన నిందితులు... వాటితో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించి రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారన్న అంశాలను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. గోల్‌మాల్‌ సూత్రధారి సాయికుమార్‌ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్‌ సహకార క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే డీజిల్‌ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్టు సమాచారం. కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ఫ్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు డాక్టర్‌ వెంకట్‌ చెప్పినట్టు తెలిసింది. కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాష్‌ మహంతి చెప్పారు. డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేస్తామని ఈడీ స్పష్టం చేసింది. 

బలమైన నెట్‌వర్క్‌... ఉమ్మడి కార్యాచరణ

ప్రభుత్వ శాఖల్లోని నిధులను వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించి వాటిని కొల్లగొట్టేందుకు సాయికుమార్‌ ఒక బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని సీసీఎస్‌ పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. పదేళ్ల క్రితం అతడికి నండూరి వెంకటరమణ(తణుకు, ఏపీ), రాజ్‌కుమార్‌(ధర్మవరం, ఏపీ)లు పరిచయమయ్యారు. మైనార్టీ కార్పొరేషన్‌, ఏపీ హౌసింగ్‌ బోర్డు, కాలుష్య నియంత్రణ మండలిలకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో సాయికుమార్‌కు వీరు వెన్నంటి ఉన్నారు. ఫలానా ప్రభుత్వ శాఖలో నిధులు కొట్టేద్దామని పథకం సిద్ధం చేసుకున్నాక అధికారులు, బ్యాంక్‌ మేనేజర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వారిని ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుని నిధులు కొట్టేద్దాం అంటూ ప్రణాళిక వివరిస్తారు. అనంతరం కొంతమంది వ్యక్తులను నియమించుకుని ఉమ్మడిగా పనులు పూర్తిచేస్తున్నారు.

ఇదీ చూడండి: Telugu Academy Case: అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి 

Telugu Akademi Case Mastermind: కమీషన్ ఆశజూపి.. కోట్లు కొల్లగొట్టాడు!

TELUGU AKADEMI FD SCAM : తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్​లో ఎవరి వాటా ఎంతంటే..?

Last Updated :Oct 8, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.