ETV Bharat / state

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 9:39 PM IST

CM Revanth Reddy Review on Hyderabad City Development : రాష్ట్ర రాజధానిలో అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నగరంలో డంపింగ్ యార్డుల నిర్వహణ, మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణపై అధికారులతో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్షించారు. నగరం నలువైపులా నాలుగు డంపింగ్​ యార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తొలి దశలో 55 కిలోమీటర్ల మేర మూసీనది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

CM Revanth Reddy Review
CM Revanth Reddy Review on Hyderabad City Development

CM Revanth Reddy Review on Hyderabad City Development : కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్​ మహానగరంపై సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించారు. నగర జనాభాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుదీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం మూసీ నది(Musi River) పరివాహక ప్రాంత అభివృద్ధి, డంపింగ్​ యార్డుల నిర్వహణ, మెట్రో రైలు విస్తరణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్​ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్​ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

డంప్​ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ నగరం మొత్తానికి జవహర్​ నగర్​లో ఒకే డంప్​ యార్డు ఉందని, ప్రతిరోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్​నగర్​ డంప్​ యార్డుకు చేరుతుందని అధికారులు వివరించారు. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే విధంగా నగరానికి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్​లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు టీఎస్​పీఎస్పీడీసీఎల్(TSPSPDCL)​తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంత వరకు రీసైకిల్​ చేయాలని ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

సీఎం రేవంత్ కీలక నిర్ణయం - రాయదుర్గం టు శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశం

CM Revanth Reddy Review Meetings : అలాగే మూసీనది పరివాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మూసీనది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్​లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసి నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్(Charminar), గొల్కొండ, సెవెన్​ టూంబ్స్​, తారామతి బారాదరి వంటి వాటిని అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్​ను రూపొందిచాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం- ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. మూసీనది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఐదు నక్షత్రాల హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

CM Revanth Reddy Review on Metro Rail Route : మరోవైపు సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్(Metro Rail) రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతనిచ్చారు. గతంలో గచ్చిబౌలి ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది సొంత వాహనాల్లోనే విమానాశ్రయానికి వెళ్తున్నారన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ-ఫలక్​నుమా-ఎయిర్​పోర్టు రూట్​, ఎల్బీనగర్​ నుంచి ఎయిర్​పోర్టు రూట్​ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్​ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు ఇస్తుంటారని, అందుకే ఈ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

మూడు కస్టర్లుగా తెలంగాణ విభజన : సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.