ETV Bharat / state

'అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం.. ప్రధాని సిద్ధమా..?'

author img

By

Published : Apr 8, 2023, 4:50 PM IST

Updated : Apr 8, 2023, 5:14 PM IST

BRS Ministers
BRS Ministers

BRS Ministers fires on PM Modi Speech in Hyderabad : సికింద్రాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి రాజకీయాలు చేయడం మంచిది కాదని ధ్వజమెత్తారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.

BRS Ministers fires on PM Modi Speech in Hyderabad : రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్ర సర్కార్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని చేసిన ఆరోపణలపై తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రధాని చర్చకు సిద్ధమా ? : అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి రాజకీయాలు చేయడం మంచిది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. ప్రధాని తమతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలన్నారు. దేశంలోని అవినీతిపరులను చేర్చుకుని పునీతులను చేస్తున్నది బీజేపీ అని ధ్వజమెత్తారు. అదానీపై ప్రపంచమంతా మాట్లాడుతుంటే.. ప్రధాని మాట్లాడట్లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ వచ్చి మరీ తిట్టాలా.. దిల్లీలో కూర్చోని తిట్టొచ్చు కదా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

'అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం.. ప్రధాని సిద్ధమా..?'

'ఏ అభివృద్ధి పనులు కేంద్రం చేస్తోందని అడ్డుకుంటున్నాం. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. అదానీపై జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోంది. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంట్‌పై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్ధమా ? బీజేపీలో కుటుంబ పాలన లేదా ? కర్ణాటకలో అవినీతిపై ప్రధాని ఎందుకు మాట్లాడరు ? భారత్‌ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు. అక్కడి నుంచే కదా ప్రధాని-సీఎం మధ్య దూరం పెరిగింది.'- తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక శాఖ మంత్రి

ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ : మెడికల్‌ కళాశాలలు ఇస్తే ఎవరైనా కాదన్నారా అని తలసాని ధ్వజమెత్తారు. దేశానికి ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణలో అద్భతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాం.. అక్కడే విగ్రహం ఏర్పాటు చేశామన్న తలసాని.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. తిరుపతికి ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి.. కొత్తగా రైలు కనిపెట్టి ప్రారంభించినట్లు మోదీ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు తెలంగాణకే వస్తున్నాయని తలసాని స్పష్టం చేశారు.

తెలంగాణపై కేంద్రానికి ఎందుకు ఇంత కక్ష: కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చేది గోరంత.. చెప్పుకునేది కొండంత అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే ఇప్పుడూ రాజకీయాల్లో ఉన్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు రావట్లేదని శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కూడా రైళ్లు వెళ్లాలి కాబట్టే.. వందేభారత్‌ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదని.. అప్పర్‌భద్రకు ఎందుకు ఇచ్చారని శ్రీనివాస్​గౌడ్ నిలదీశారు. తెలంగాణపై కేంద్రానికి ఎందుకు ఇంత కక్ష అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు.

'కేసీఆర్‌కు తెలంగాణ అంతా కుటుంబమే. కేసీఆర్‌ కుటుంబం అభివృద్ధికే పాటుపడతారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మెడికల్‌ కళాశాల ఇచ్చి మాట్లాడాలి. సింగరేణిని ఎవరి కోసం ప్రైవేటీకరణ చేశారో అందరికీ తెలుసు. మీరు అధికారంలో లేనప్పుడు సీబీఐని విమర్శించి.. ఇప్పుడు పొగుడుతారా. తెలంగాణను చూసి బీజేపీ పాలిత రాష్ట్రాలు నేర్చుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు.'- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ.. మోదీ కుటుంబం అదానీ : రైతుల వద్ద పంట కొంటారా.. లేదా అనేది మోదీ మాట్లాడలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది వలస వచ్చిన వారు ఉంటారన్న ఆయన.. రేషన్‌ పెంచమని అడిగితే పెంచలేదన్నారు. కేంద్రం 10 ఏళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా పెంచలేదని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రేషన్‌కార్డులు పెంచుతూ.. 97 లక్షల మందికి రేషన్‌కార్డు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ.. మోదీ కుటుంబం అదానీ అని ఆరోపించారు. కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత మోదీకి ఉందా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 8, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.