ETV Bharat / bharat

ప్రధాని హైదరాబాద్ పర్యటన.. రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

author img

By

Published : Apr 8, 2023, 2:11 PM IST

Updated : Apr 8, 2023, 2:30 PM IST

PM Modi
PM Modi

PM Modi Inaugurates Development Works in Telangana : అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో పర్యటించిన... ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 11వేల 300కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రైల్వేలు, రహదారి, ఆరోగ్య రంగాల్లో పనుల్ని ప్రారంభించారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణతో పాటు పలు జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు.

ప్రధాని హైదరాబాద్ పర్యటన.

PM Modi Inaugurates Development Works in Telangana : తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ విమానాశ్రయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్‌ శాంతికుమారి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.... సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రారంభించిన ప్రధాని మోదీ : అనంతరం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పరేడ్‌ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీ... అక్కడ ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ జంటనగరాల సబర్బన్‌ పరిధిలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించారు. రెండోదశలో భాగంగా... మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్ -సికింద్రాబాద్-తెల్లాపూర్ మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం బీబీ నగర్ ఎయిమ్స్‌ నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రధాని సభా వేదిక నుంచే వర్చువల్‌గా అంకురార్పణ చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన : 720కోట్ల రూపాయలతో మూడు దశల్లో చేపట్టే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. మొదటి దశ పనులు 16 నెలల్లో, రెండో దశ 28, మూడోదశ పనుల 36 నెలల్లో... పూర్తి కానున్నాయి. 1410 కోట్ల నిధులతో దాదాపు 85.24 కిలోమీటర్ల మేర సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ ప్రాజెక్ట్ డబ్లింగ్ విద్యుదీకరణను ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు.

రూ.7,864 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ : 7వేల 864కోట్లతో చేపట్టే... 6 జాతీయ రహదారుల విస్తరణకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అక్కల్‌కోట్ -కర్నూలు, మహబూబ్ నగర్ - చించోలి, కల్వకుర్తి-కొల్లాపూర్, నిజాంపేట్ - నారాయణఖేడ్ - బీదర్‌తో పాటు ఖమ్మం - దేవరపల్లి మధ్య జాతీయ రహదారులను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఖమ్మం-దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌గా నిర్మించనున్నారు. మహబూబ్ నగర్-చించోలి మార్గాన్ని.. 1,334 కోట్లతో రెండు ప్యాకేజీలుగా విస్తరించనున్నారు. మిగిలిన నాలుగు రహదారుల పనులను... ఒక్కో ప్యాకేజీగా చేపట్టనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 8, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.