ETV Bharat / bharat

కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: ప్రధాని మోదీ

author img

By

Published : Apr 8, 2023, 2:17 PM IST

Updated : Apr 8, 2023, 3:18 PM IST

PM Modi Comments on BRS Govt
PM Modi Comments on BRS Govt

PM Modi Comments on BRS Govt : అవినీతి, అక్రమాల్లో మునిగిన కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదన్న మోదీ.. కొందరు అన్ని వ్యవస్థలు గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని స్పష్టం చేసిన ఆయన.. రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

PM Modi Comments on BRS Govt : తెలంగాణలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా ప్రయాస్, సబ్‌ కా సాథ్' అనే నినాదంతో సామాన్యులతోనే ఉండి దేశాభివృద్దికి పాటుబడ్డామని ప్రధాని అన్నారు. ప్రియమైన సోదర సోదరీమణులారా... మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ... కేంద్రంలోకి తామోచ్చాక తెలంగాణలో భారీగా అభివృద్ది జరిగిందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరోపణలను మోదీ ఖండించారు. అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వంతో.. రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావట్లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందన్నారు.

దేశం ఒక నవ భారతం.. నలుమూలల అభివృద్ధి చెందుతోంది : కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదన్న మోదీ.. అవినీతిపరులకు నిజాయతీతో పని చేసే వారంటే భయం పట్టుకుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్‌ రైలు ద్వారా టెక్నాలజీ నుంచి ఆధ్యాత్మిక ప్రాంతానికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ పనులు చేపట్టామని... ఈ రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఒక నవ భారతమని... నలుమూలల అభివృద్ది జరుగుతోందన్నారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు డబ్లింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులతో రవాణా సమయం తగ్గడంతో పాటు ట్రాన్స్ పోర్ట్ సులువుగా అయిందన్న ప్రధాని మోదీ... పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు.

కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్​గా మారింది : దేశవ్యాప్తంగా 7 టెక్స్​టైల్ పార్కులను కేంద్రం ఏర్పాటు చేస్తోందని... తెలంగాణకు ఒకటి కేటాయించామని దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మోదీ తెలిపారు. ఈ నవభారతంలో దేశ ప్రజల కలలను నిజం చేయడమే తమ ధ్యేయమని... కానీ పిడికేడంతా కూడా లేని కొందరు వ్యక్తులు తమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. కుటుంబ పార్టీ, మామ, అల్లుడు, కూతురు, కొడుకు ఉన్న పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్​గా మారిందని దుయ్యబట్టారు. కుటుంబ పార్టీలు అందరినీ తమ కంట్రోల్​లో ఉంచుకోవాలని చూస్తాయన్న ప్రధాని... వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే వారికి నచ్చదని... అలా ప్రశిస్తే అణిచివేయాలని చూస్తారని విమర్శించారు.

కుటుంబ పార్టీలు సామాన్యుల రేషన్ కూడా దోచుకుంటున్నాయి : వ్యవస్థ, సిస్టంపై కంట్రోల్ పెంచుకోవాలని కుటుంబ పార్టీలు పని చేస్తున్నాయని... అవినీతి చేసిన డబ్బులన్ని దాచుకున్నారని ప్రజా సంక్షేమం కోసం అందించే నిధులు కూడా వారి ఖాతాల్లోనే దాచుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పార్టీల అవినీతిని ఎదుర్కోవాలా వద్దా.. వారిని ప్రశ్నించాలా వద్దా.. ప్రజలు నిర్ణయించాలని... అవినీతి చేసే పార్టీలకు చెక్ పెట్టాలా వద్దా.. వారికి బ్రేకులు వేయాలా వద్దా అని ప్రశ్నించారు. 2014 తర్వాత దేశానికి సంకెళ్ళ నుంచి విముక్తి లభించిందన్నారు. తెలంగాణలో ఉన్నట్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ పార్టీలు సామాన్యుల రేషన్ కూడా దోచుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏండ్లలో దేశంతో పాటు తెలంగాణకు మహర్దశ ఉంటుందని... తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ వివరించారు.

కుటుంబపాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: ప్రధాని మోదీ

'రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతున్నాయి. తండ్రి, కుమారుడు, కుమార్తె.. అంతా అధికారంలో ఉంటారు. కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది. కుటుంబ పాలనతో కొందరు ప్రగతి నిరోధకులుగా మారారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు. అవినీతిపరులకు నిజాయతీతో పని చేసే వారంటే భయం. రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వమే రాలేదు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో తెలంగాణ కలిసి రావట్లేదు. కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి. బీజేపీని ఆశీర్వదిస్తే.. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం.' - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇవీ చూడండి..

Last Updated :Apr 8, 2023, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.