ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఆసక్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 8:10 AM IST

BRS focus on LokSabha elections 2024
BRS focus on LokSabha elections 2024

BRS Focus on LokSabha Elections 2024 : శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా, ప్రజల్లోకి వెళ్లి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే, తదుపరి ఎన్నికల సన్నాహంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్, మాజీ ఎంపీలతోపాటు ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోన్న బీఆర్ఎస్

BRS Focus on LokSabha Elections 2024 : రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS), త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పవచ్చు. ఓటమిని విశ్లేషిస్తున్న గులాబీ నాయకత్వం, ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతోంది. ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలపై అంతర్గతంగా కసరత్తు : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు (LokSabha Elections 2024) పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో సారు-కారు-పదహారు నినాదంతో వెళ్లిన గులాబీ పార్టీ, కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలుపొందారు.

'ఫలితాలను చూసి నిరాశపడొద్దు - బీఆర్‌ఎస్‌కు ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేక్ మాత్రమే'

ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (Kotha Prabhakar Reddy) ఇటీవలి ఎన్నికల్లో, దుబ్బాక నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్‌కు ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో మిగతా పార్టీల కంటే, భారత్ రాష్ట్ర సమితికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ పరిధిలో రెండు స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్‌సభ పరిధి మొత్తంలో మాత్రం ఎక్కువగానే వచ్చాయి.

BRS on LokSabha Elections 2024 : కరీంనగర్ పరిధిలో కూడా మూడు స్థానాల్లోనే, బీఆర్ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ, లోక్‌సభ పరిధి మొత్తంలో ఓట్లు మాత్రం స్వల్పం కంటే ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే 5000ల ఓట్లు ఎక్కువ రాగా, నిజామాబాద్ పరిధిలోనూ ఆధిక్యం స్వల్పంగానే ఉంది. అక్కడ హస్తం పార్టీ కంటే 9000 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.

ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్

Bharat Rashtra Samithi on Parliament Poll 2024 : సిట్టింగ్ తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో కేవలం, మెదక్, చేవెళ్లలో మాత్రమే బీఆర్ఎస్‌కు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ ఎంపీలున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌తోపాటు, కాంగ్రెస్ స్థానమైన మల్కాజ్‌గిరిలో భారత్ రాష్ట్ర సమితికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ అన్ని అంశాలను విశ్లేషించుకొని లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.

కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం : సిట్టింగ్ ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈమారు కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం బీఆర్ఎస్‌లో ఉంది. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు, చేర్పులు జరగవచ్చని అంటున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో త్రిముఖ పోటీ : లోక్‌సభ ఎన్నికల్లో ఈమారు, రాష్ట్రంలో బలమైన త్రిముఖ పోటీ జరగనుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. బీఆర్ఎస్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా జాతీయ నాయకత్వం కింద పనిచేసే పార్టీలని, తాము మాత్రమే స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని భారత్ రాష్ట్ర సమితి అంటోంది. ఆ రెండు పార్టీల నేతలు దిల్లీకి జీహుజూర్ అనేవారని, తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా తాము ఉంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశం ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు.

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.