ETV Bharat / state

నాకు ఎలాంటి నోటీసు రాలేదు.. విచారణకు హాజరుకాలేను: సిట్​కు బండి లేఖ

author img

By

Published : Mar 24, 2023, 1:44 PM IST

Bandi Sanjay Letter to SIT: సిట్‌ అధికారులకు బండి సంజయ్ లేఖ రాశారు. సిట్ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని పేర్కొన్నారు. అందులోని విషయాలు చూడలేదని వివరించారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఇవాళ తాను హాజరుకావడం లేదని లేఖలో ఆయన తెలిపారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Letter to SIT: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్‌కు ఆయన లేఖ రాశారు. సిట్‌ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీసు రాలేదని.. అందులోని విషయాలు తాను చూడలేదనే అంశాన్ని నిస్సందేహంగా తెలియజేస్తున్నాని చెప్పారు.

వార్తా కథనాల ద్వారా తెలిసింది: ఈ రోజు సిట్ ఎదుట తాను హాజరు కావాల్సింది ఉందని వార్తా కథనాల ద్వారా తెలిసిందని బండి సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎంపీగా పార్లమెంట్‌కు హాజరు కావాల్సిన బాధ్యత తనకుందని చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఇవాళ సిట్‌ విచారణకు తాను రాలేనని స్పష్టం చేశారు. దీనిపై హాజరుకు మరో తేదీ ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

సిట్‌కు బండి సంజయ్ లేఖ
సిట్‌కు బండి సంజయ్ లేఖ

మరోవైపు నిన్ననే బీజేపీ వర్గాలు బండి సంజయ్‌ సిట్‌ విచారణకు హాజరుకావడం లేదని తెలిపాయి. పార్లమెంట్‌ సమావేశాల వల్ల ఆయన దిల్లీలోనే ఉన్నారని పేర్కొన్నాయి. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సభ్యులంతా సభకు హాజరుకావాలని అధిష్ఠానం విప్‌ జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇదిలా ఉండగా.. సిట్ అధికారుల విచారణకు రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా గ్రూప్‌-1 పేపర్‌ అంశంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిట్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి విచారణకు హాజరై వాటిపై వివరణ ఇచ్చారు.

కేటీఆర్‌ వద్ద సంపూర్ణమైన సమాచారం: విచారణ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆక్షేపించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దేనని ఆరోపించారు. కానీ జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై కూడా సిట్​ చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణలో మంత్రి వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని.. ఆయన సమాచారం ఎందుకు సేకరించలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

నిరాధారమైన ఆరోపణలు చేశారనే కోణం: అయితే ఇందులో భాగంగానే టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ అంశంలో రేవంత్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారనే కోణంలో సిట్​ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. బుధవారం విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్​ తెలిపింది.

ఇవీ చదవండి: 'KTR నోటీసులకు భయపడేదే లే.. రాజకీయంగా పోరాడతాం'

'కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్‌ అధికారికి చెప్పా'

మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై గ్యాంగ్​రేప్​.. స్కూల్ అటెండర్, అతడి స్నేహితులు కలిసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.