ETV Bharat / sports

Tokyo Paralympics: కోచ్​ లేకుండానే పతకం పట్టేశాడు!

author img

By

Published : Aug 30, 2021, 12:57 PM IST

Have been training without a coach: discus throw silver-winner Kathuniya
Tokyo Paralympics: కోచ్​ లేకుండానే పతకం పట్టేశాడు!

క్రీడల్లో పోటీ పడే అథ్లెట్లు సరైన సలహాలు, సూచనల కోసం నిష్ణాతులైన శిక్షకుల నేతృత్వంలో సాధన చేయడం సహజం. అలాంటిది విశ్వక్రీడా వేదికపై ప్రదర్శన చేయాలంటే కఠోర శ్రమతో పాటు అనుభవజ్ఞులైన కోచ్​ సలహాలు అనివార్యం. అయితే పారాలింపిక్స్​లో(Paralympics) పాల్గొన్న ఓ భారత క్రీడాకారుడు.. కోచ్​ లేకుండానే ఏకంగా పతకం సాధించాడు. పురుషుల డిస్కస్​ త్రోలో 44.38 మీ. విసిరి రజత పతకాన్ని సాధించాడు. అతడే దిల్లీకి చెందిన యోగేశ్​ కతునియా(Yogesh Kathuniya). ఏడాది కాలంగా కోచ్​ లేకుండానే సాధన చేసి పతకాన్ని ఒడిసిపట్టిన యోగేశ్​ కథేంటో తెలుసుకుందాం.

టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics)​ పురుషుల డిస్కస్​ త్రో రజత పతకంతో మెరిశాడు భారత క్రీడాకారుడు యోగేశ్​ కతునియా(Yogesh Kathuniya). అయితే ఆటలో అతడికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కనీసం కోచ్​ కూడా లేరంటే మీరు నమ్ముతారా? అవును నిజం. యోగేశ్​.. ఏడాది కాలంగా కోచ్​ లేకుండానే ఆటలో మెళకువలు నేర్చుకొని సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఈ విషయంలో తన తల్లిది కీలకపాత్ర అని మెడల్​ సాధించిన అనంతరం వెల్లడించాడు.

న్యూదిల్లీలోని కిరోరిమల్​ కళాశాలలో బీ.కామ్​ చదువుతున్న యోగేశ్​ కతునియా.. టోక్యో పారాలింపిక్స్​లో డిస్కస్​ త్రో విభాగంలో భారత్​ తరఫున పోటీపడ్డాడు. ఆరో ప్రయత్నంగా 44.38 మీ. దూరం ఈటెను విసిరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్​ మెడల్​ సాధించాడు.

Have been training without a coach: discus throw silver-winner Kathuniya
యోగేశ్​ కతునియా

"ఇదో అద్భుతమైన పరిణామం. 2024లో పారిస్​ వేదికగా జరగనున్న పారాలింపిక్స్​లో బంగారు పతకం గెలిచేందుకు ఈ సిల్వర్​ మెడల్​ ఎంతో ప్రేరణనిస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా గత 18 నెలల్లో పోటీలకు సన్నద్ధమవ్వడం చాలా క్లిష్టంగా మారింది. ఆరు నెలల పాటు కొనసాగిన లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాలు మూతపడ్డాయి. లాక్​డౌన్​ అనంతరం స్టేడియంలోకి అడుగుపెట్టిన తర్వాత.. నాకు నేనుగా సాధన మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు సలహాలు, సూచనలిచ్చేందుకు కోచ్​ కూడా లేరు. కోచ్​ లేకుండానే రజత పతకం గెలవడం ఓ గొప్ప అనుభూతి".

- యోగేశ్​ కతునియా, పారా డిస్కస్​ త్రో క్రీడాకారుడు

యోగేశ్​ కతునియా.. ఓ ఆర్మీ అధికారి కుమారుడు. తన ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతానికి గురయ్యాడు. "ఇప్పటి నుంచి నేను మరింతగా కృషి చేయాలి. ఎందుకంటే స్వర్ణ పతకానికి నేను మీటర్​ దూరంలో ఆగిపోయాను. పారిస్​లో ప్రపంచ రికార్డును అధిగమించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను" అని యోగేశ్​ అన్నాడు.

2019లో దుబాయ్​ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో 42.51 మీ. దూరం డిస్క్​ను విసిరి టోక్యో పారాలింపిక్స్​కు అర్హత సాధించాడు. ఆ తర్వాత బెర్లిన్​ వేదికగా 2018లో జరిగిన పారా-అథ్లెటిక్స్​ గ్రాండ్​ప్రిక్స్​ పోటీల్లోని ఎఫ్​36 విభాగంలో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.

యోగేశ్​.. తొలిసారి జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం(దిల్లీ)లోని సత్యపాల్​ సింగ్​ కోచ్​ నేతృత్వంలో సాధన చేశాడు. ఆ తర్వాత నవల్​ సింగ్​ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు.

ఇదీ చూడండి.. పారాలింపిక్స్​లో భారత్​కు పతకాల పంట

డిస్కస్​ త్రోలో యోగేశ్​కు రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.