ETV Bharat / sports

World Archery Championships : పసిడిని ముద్దాడిన భారత్.. ఫైనల్​ పోరులో అదరగొట్టిన తెలుగమ్మాయి

author img

By

Published : Aug 5, 2023, 8:34 AM IST

World Archery Championships 2023
పసిడిని ముద్దాడిన భారత్

World Archery Championships : ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌.. తొలి బంగారు పతకం సాధించింది. భారత త్రయం మహిళల కాంపౌండ్ విభాగంలో.. మెక్సికో ప్లేయర్లపై పైచేయి సాధించి స్వర్ణం పట్టేశారు.

World Archery Championships : వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌ షిప్‌లో భారత్‌ తొలి స్వర్ణ పతకం సాధించింది. బెర్లిన్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత ప్లేయర్లు జ్యోతి సురేఖ, ప్రణీత్‌ కౌర్‌, అదితి గోపీచంద్‌.. మహిళల కాంపౌండ్‌ విభాగంలో బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎదురైన ప్రత్యర్థులను ఓడిస్తూ.. ఫైనల్స్​కు దూసుకెళ్లారు. ఫైనల్స్​లో మెక్సికోకు చెందిన డఫ్నే క్విన్‌టెరో, అనా సోఫా హెర్నాండెజ్‌, అండ్రే బెసెర్రాతో భారత త్రయం తలపడింది. తుదిపోరులోనూ జోరు ప్రదర్శిస్తూ.. రెండో సీడ్‌ భారత జట్టు 235-229 తేడాతో టాప్‌ సీడ్‌ మెక్సికోపై గెలిచి జయకేతనం ఎగురవేసింది.

కాగా ఫైనల్స్​లో పటిష్ఠమైన మెక్సికో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించారు భారత క్రీడాకారిణులు. మొదటి రౌండ్​లో 60కి 59 స్కోర్​తో తుదిపోరును ఘనంగా ఆరంభించారు. ఈ రౌండ్​లో మెక్సికో జట్టు 57 పాయింట్లు సాధించింది. ఇక వరుసగా రెండు, మూడు రౌండ్​లలోనూ 59 పాయింట్లు సాధించి.. ఆఖరి రౌండ్​కు ముందు 177-172తో భారత ప్లేయర్లు లీడ్​లో ఉన్నారు.

ఇక చివరి రౌండ్​.. ఆఖరి సెట్​లో 207 - 199 ఉన్న దశలో ప్రత్యర్థి ప్లేయర్లు 30 పాయింట్లు సాధించి 229 వద్ద నిలిచారు. ఆ దశలో భారత త్రయంలో మొదట పర్ణీత్‌ 10 పాయింట్లు గెలిచింది. తర్వాత అదితి 9 పాయింట్లు సాధించింది. విజయానికి మరో ఐదు పాయింట్లు అవసరమైన దశలో సురేఖ.. విల్లు ఎక్కుపెట్టి 9 పాయింట్లు నెగ్గి.. భారత్​ను ఛాంపియన్​గా నిలిపింది.

ఈ పోటీల్లో భారత త్రయం సెమీస్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొలంబియాను ఎదుర్కొంది. ఈ పోరులో ప్రత్యర్థి జట్టును 220-216 తేడాతో ఓడించి ఫైనల్స్​లో అడుగుపెట్టింది.

"మా దృష్టి అంతా ఆట పైనే ఉంచాం. అయితే మేము ఇప్పటికే చాలాసార్లు రజతం సాధించాం. కానీ ఈసారి స్వర్ణ పతకం గెలవాలని దృఢంగా నిశ్చయించుకున్నాం. ఈ గెలుపు ఆరంభం మాత్రమే. మున్ముందు అనేక పతకాలు సాధించాలి. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో భారత్​కు ఇదే మొదటి స్వర్ణం. ఇది మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన కోచ్​, సహాయన టీమ్​కు థ్యాంక్స్. వ్యక్తిగత విభాగంలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి.. మరో స్వర్ణం సాధించాలనుకుంటున్నా"

- జ్యోతి సురేఖ.

కాగా మహిళల వ్యక్తిగత విభాగంలో శనివారం జరగనుంది. ఈ పోరులో జ్యోతి.. తన సహచర ఆర్చర్‌ పర్ణీత్‌తోనే తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో అదితి.. నెదర్లాండ్స్​ ప్లేయర్ డి లాత్‌ను ఎదుర్కోనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.