ETV Bharat / sports

ఆసియా ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో తెలుగమ్మాయికి స్వర్ణం

author img

By

Published : Nov 18, 2021, 4:24 PM IST

Updated : Nov 18, 2021, 5:10 PM IST

asian archery championship
Jyothi Surekha

ఆసియా ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో (Asian Archery Championship) పసిడి పతకం కైవసం చేసుకుంది భారత ఆర్చర్ జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam). గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్​ యూహ్యూన్ పై(Yoohyun) గెలుపొంది ఈ మెడల్​ను అందుకుంది.

ఆసియా ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో (Asian Archery Championship 2021) తెలుగమ్మాయి జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. గురువారం ఢాకాలో జరిగిన కాంపౌండ్​ వ్యక్తిగత మహిళల విభాగం ఫైనల్లో గెలిచి స్వర్ణం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్​లో ప్రపంచ మాజీ ఛాంపియన్​ ఓహ్​ యూహ్యూన్​పై 146-145 తేడాతో గెలిచింది (Jyothi Surekha Vennam) సురేఖ.

asian archery championship
పసిడితో సురేఖ

25 ఏళ్ల జ్యోతి సురేఖకు.. ఆసియా ఛాంపియన్​షిప్​లో ఇది రెండో పసిడి కావడం విశేషం. ఈ సీజన్​లో భారత్​కు ఇదే తొలి బంగారు పతకం.

అంతకుముందు కాంపౌండ్​ మిక్స్​డ్​ జట్టు విభాగంలో రజత పతకంతో సరిపెట్టుకున్నారు రిషభ్​ యాదవ్, జ్యోతి సురేఖ. కొరియా ద్వయం కిమ్ యున్హీ, చోయ్ యోంగీ చేతిలో 155-154 తేడాతో ఓడిపోయారు.

చిన్ననాటి నుంచే..

11 ఏళ్ల వయసులో తొలిసారి విల్లు చేతబట్టి అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అగ్రశ్రేణి కాంపౌండ్‌ ఆర్చర్‌గా నిలిచింది (Jyothi Surekha Archery) సురేఖ. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ (Jyothi Surekha Vennam World Ranking) సత్తాచాటుతోంది. కాంపౌండ్‌ ఆర్చరీలో మహిళల వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదిలోపు స్థానాలను సొంతం చేసుకున్న ఏకైక ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. జాతీయ రికార్డు ఆమె పేరు మీదే ఉంది. 2017 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో జట్టు రజతాన్ని అందుకున్న ఆమె.. 2019లో జట్టుతో పాటు వ్యక్తిగత కాంస్యాన్ని సొంతం చేసుకుంది.

ఆ నిరాశను దాటి..

ఈ ఏడాది ఏప్రిల్‌లో గాటెమాలాలో ప్రపంచకప్‌ పోటీల కోసం విమానాశ్రయానికి వెళ్తున్న ఆర్చర్ల బస్సును అర్ధరాత్రి నడిరోడ్డుపై అర్ధంతరంగా ఆపేశారు. ఓ కోచ్‌కు తప్పుడు పాజిటివ్‌ ఫలితంతో కాంపౌండ్‌ ఆర్చర్లను టోర్నీకి పంపించలేదు. అందులో సురేఖ కూడా ఉంది. జాతీయ శిబిరానికి కూడా అనుమతించకపోవడం వల్ల అర్ధరాత్రి ఆమె దిల్లీ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంది. ఈ సంఘటనతో ఆమె నిరాశకు గురైంది.

రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడే అవకాశం కోల్పోయినందుకు బాధ పడింది. కానీ దాని నుంచి త్వరగానే కోలుకున్నప్పటికీ పారిస్‌ ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. కానీ ఆ తప్పుల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకుని మరింత మెరుగైంది. ఇప్పుడు ఒకే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు విభాగాల్లోనూ(వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌) పతకాలు గెలిచిన ఏకైక భారత ఆర్చర్‌గా కొనసాగుతోంది. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రాణిస్తున్న ఆమెకు.. ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ఇప్పటికైతే లేదు. అందులో ఆమె పోటీపడే కాంపౌండ్‌ విభాగం లేకపోవడమే అందుకు కారణం.

ఇదీ చూడండి: Jyothi Surekha Archery: రికార్డులు కొల్లగొట్టడం 'విల్లు'తో పెట్టిన విద్య!

Last Updated :Nov 18, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.