ETV Bharat / sports

రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం!.. గాయం ఇంకా తగ్గలేదా?

author img

By

Published : Dec 19, 2022, 3:09 PM IST

Rohith Sharma Injury:
Rohith Sharma Injury:

టీమ్​ఇండియా సారథి రోహిత్​ శర్మ.. బంగ్లాదేశ్​తో జరిగే రెండో టెస్టు మ్యాచ్​కు దూరమవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అతడి గాయం తగ్గలేదని సమాచారం.

Rohith Sharma Injury: టీమ్​ఇండియా స్టార్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవ్వడం పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా రోహిత్ శర్మ గాయపడటం ఈ సమస్యను మరింత పెద్దది చేసింది. ఈ గాయం కారణంగా రోహిత్.. బంగ్లాతో మూడో వన్డే, మొదటి టెస్టు రెండింటికీ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు రెండో టెస్టులో కూడా ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గాయం ఎలా జరిగింది?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది అతడి బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటనవేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో స్కానింగ్ కోసం పంపించారు. చేతికి కుట్లు కూడా పడినట్లు సమాచారం. ఆ తర్వాత జట్టు ఓటమి అంచుల్లో నిలిచినప్పుడు గాయం ఉన్నా కూడా బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో గాయం మరింత పెద్దది అయిందని తెలుస్తోంది.

రెండో టెస్టుకు దూరం?
గాయంతో ముంబయి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకున్నాడు. మూడో వన్డేలోనూ ఆడలేదు. అలాగే తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువబ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికీ రోహిత్ గాయం పూర్తిగా మానలేదని తెలుస్తోంది. ఇంకా అతడి బొటన వేలు నొప్పిగానే ఉందని, గట్టిగా పట్టేసినట్లుగా ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా రోహిత్ బ్యాటింగ్ చేసినా.. ఫీల్డింగ్ సమయంలో ఈ గాయం మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉందట. అందుకని రోహిత్ విషయంలో ఇంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని బీసీసీఐ భావిస్తోందట.

రీఎంట్రీ అప్పుడేనా?
రోహిత్ రెండో టెస్టుకు దూరమైనట్లు అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. బీసీసీఐ దాదాపు ఇదే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో రెండో టెస్టులో కూడా తాత్కాలిక సారధి కేఎల్ రాహులే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో తొలి టెస్టులో మొదటి టెస్టు సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్‌కు రెండో టెస్టులో కూడా అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌కు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోంది. శ్రీలంక పర్యటన నుంచి మళ్లీ జట్టుతో రోహిత్ కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 3 నుంచి ఈ సిరీస్​ ప్రారంభం అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.