ETV Bharat / sports

ఐపీఎల్: ఒక్క పరుగు తేడాతో 'వంద' మిస్​

author img

By

Published : Aug 26, 2020, 5:51 PM IST

Updated : Aug 26, 2020, 7:04 PM IST

Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99
ఐపీఎల్: ఒక్క పరుగు తేడాతో 'వంద' మిస్

ఐపీఎల్​ ఆరంభం నుంచి తమ విధ్వంసకర బ్యాటింగ్​తో ఎంతోమంది క్రికెటర్లు గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 56 శతకాలు నమోదవ్వగా.. ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్​ అయిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. 99 పరుగుల వద్ద వెనుదిరిగిన, నాటౌట్​గా నిలిచిన స్టార్​ బ్యాట్స్​మెన్లు ఎవరో తెలుసుకుందామా.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​ ప్రారంభం కానుంది. ఇప్పటికే దుబాయ్​ చేరుకున్న ఆటగాళ్లు... ఆరు రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు​ పాటిస్తున్నారు. క్వారంటైన్​ పూర్తికాగానే ఆయా జట్లు ప్రాక్టీస్​ ప్రారంభించనున్నాయి.

ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్​తో రాణించి.. తమదైన ముద్ర వేసుకున్నారు కొంత మంది క్రికెటర్లు.

56 శతక వీరులు..

ఐపీఎల్​ తొలి సీజన్​ ఆరంభ మ్యాచ్​ కోల్​కతా నైట్​రైడర్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరిగింది. అందులో కోల్​కతా జట్టుకు చెందిన బ్యాట్స్​మన్​ బ్రెండన్​ మెక్​కల్లమ్​​ 78 బంతుల్లో 158 పరుగులు చేసి క్రికెట్​ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అప్పటి నుంచి ఈ టోర్నీలో మొత్తం 56 శతకాలు నమోదయ్యాయి. అయితే ఐపీఎల్​లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన ప్లేయర్ల గురించి తెలుసుకుందామా..

1)ఐపీఎల్​ 2013: విరాట్​ కోహ్లీ (99) Vs దిల్లీ డేర్​డెవిల్స్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఖాతాలో 99 పరుగులతో వెనుదిరిగిన రికార్డు ఉంది. ఐపీఎల్​లో 99 రన్స్​ వద్ద ఔట్​ అయిన తొలి ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం.

Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99
విరాట్​ కోహ్లీ

2013లో దిల్లీ డేర్​డెవిల్స్​పై జరిగిన మ్యాచ్​లో 58 బంతుల్లో 99 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి వెనుదిరిగాడు. దీంతో బెంగుళూరు జట్టు స్కోరు 183 మార్క్​ అందుకుంది. ఆ మ్యాచ్​లో కోహ్లీ సైన్యం దిల్లీపై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2)ఐపీఎల్​ 2013: సురేశ్​ రైనా (99 నాటౌట్​) Vs సన్​రైజర్స్​ హైదరాబాద్​

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో చిన్న తలాగా పేరొందిన సురేశ్​ రైనా అనేక సార్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2013లో సన్​​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుపై ఒక్క పరుగు తేడాతో శతకాన్ని మిస్​ అయ్యాడు.

Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99
సురేశ్​ రైనా

తొలుత సీఎస్కే బ్యాటింగ్​లో మూడో స్థానంలో దిగిన రైనా.. మైక్​ హస్సీతో కలిసి 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్​లో 99 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి నాటౌట్​గా నిలిచాడు రైనా. 52 బంతుల్లోనే ఆ ఘనతను సాధించి 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​కు ఎంపికయ్యాడు. ఈ మ్యా​చ్​లో సీఎస్కే జట్టు 223 పరుగులు చేసి హైదరాబాద్​పై 77 రన్స్​ తేడాతో విజయం సాధించింది.

3)ఐపీఎల్​ 2019: పృథ్వీషా (99) Vs ​కోల్​కతా నైట్​రైడర్స్​

ఐపీఎల్​లో అడుగుపెట్టిన రెండో సీజన్​లోనే శతకానికి దగ్గరయ్యాడు దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు చెందిన పృథ్వీషా. ఈ యువ క్రికెటర్​ కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్​ అయ్యాడు. గతేడాది జరిగిన టోర్నీలో కోల్​కతాపై ఈ ఘనతను సాధించాడు పృథ్వీషా.

IPL news
పృథ్వీ షా

55 బంతుల్లో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కోరు పరంగా ఆ మ్యాచ్ టై అవ్వగా తర్వాత జరిగిన సూపర్​ ఓవర్​లో దిల్లీ విజయం సాధించింది. బ్యాటింగ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పృథ్వీషాకు 'ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​' అవార్డు లభించింది.

4)ఐపీఎల్​ 2019: క్రిస్​ గేల్​ (99 నాటౌట్​) Vs ఆర్సీబీ

గతేడాది కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్​ గేల్​.. తన మాజీ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్​ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టుపై 60 బంతుల్లో 99 పరుగుల(10 ఫోర్లు, 5 సిక్సర్లు)తో అజేయంగా నిలిచాడు.

Missing the feat by a single run: IPL instances when batsmen were stranded on 99
క్రిస్​ గేల్​

ఆ మ్యాచ్​లో పంజాబ్​ స్కోరును 173కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు గేల్​. ఆ తర్వాత బ్యాటింగ్​ బరిలో దిగిన ఆర్సీబీ బ్యాట్స్​మెన్లు కోహ్లీ, ఏబీ డివిలియర్స్​, మార్కస్​ స్టోయినిస్​ అద్భుతమైన ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో క్రిస్​ గేల్​ విధ్వంసకర ఇన్నింగ్స్​ వృథాగా మిగిలింది.

Last Updated :Aug 26, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.