ETV Bharat / sports

మహీ మాటే సహకారం.. అద్భుత విజయాలకు శ్రీకారం

author img

By

Published : Aug 15, 2020, 9:08 PM IST

తన కెరీర్​లో ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రోత్సాహించిన ధోనీ.. వారి సహకారంతో అద్భుత విజయాలు సాధించాడు. రోహిత్​లో విధ్వంసక ఓపెనర్​, యువరాజ్​లో ఆల్​రౌండర్, భువనేశ్వర్​లో మంచి బౌలర్​​ ఉన్నాడని గుర్తించింది మహీనే కావడం విశేషం.

dhoni retirement latest news
కుర్రాళ్లకు సహకారం.. అద్భుత విజయాలకు శ్రీకారం

మహేంద్ర సింగ్ ధోనీ అంటే ప్రోత్సాహం, సమన్వయం, మిడిలార్డర్‌ బ్యాట్సమెన్​ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడం, టెయిలెండర్లతో అర్ధశతకాలు చేయించి మ్యాచ్‌లు గెలిపించడం. ఇలాంటి ఘనతలన్నీ ఇతడికే సొంతం. అప్పటి వరకూ దారుణంగా పరుగులిచ్చిన బౌలర్లతోనూ చివరి ఓవర్ బౌలింగ్ వేయించి భారత్‌ ఖాతాలో విజయాలు చేర్చిన చరిత్ర ధోనీదే.

ముందు మూడు.. తర్వాత మిడిలార్డర్

మహేంద్రసింగ్‌ ధోనీ కెరీర్ ప్రారంభంలో విశాఖ వన్డేలో చేసిన సెంచరీని గాలివాటం అన్నవాళ్లు చాలామంది. అది తప్పని నిరూపిస్తూ శ్రీలంకపై 183 పరుగులతో చెలరేగాడు. భారత్‌కు ఓ గొప్ప వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ దొరికాడన్న ప్రశంసను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సారథిగా పగ్గాలు చేపట్టాడు. అవసరాల కోసం మిడిలార్డర్‌లోకి మారాడు. 5,6,7,8వ స్థానాల్లో దిగి, టెయిలెండర్లతో సమర్థంగా నడిపించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు ఆపద్భాందవుడిగా మారాడు. ఫినిషర్‌గానూ అనూహ్య విజయాలను అందించాడు.

రోహిత్​ ఓపెనర్​గా మారడం ధోనీ చలవే

మిడిలార్డల్‌ బ్యాట్స్​మన్ రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి భారత్‌కు విధ్వంసక ఓపెనర్‌ను అందించాడు ధోనీ. శిఖర్‌ను ప్రోత్సహిస్తూ.. రోహిత్-ధావన్ రూపంలో అన్ని ఫార్మాట్‌లలో కొన్నేళ్ల పాటు చక్కటి ఓపెనింగ్ జోడీని అందించాడు. ఐపీఎల్‌లో భాగంగా ఎంతోమంది దేశవాళీ క్రికెటర్లతో పాటు.. అంతర్జాతీయ క్రికెటర్లకు అనేక అవకాశాలు ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశాడు.

ధోనీ సహకారం.. భువీ అద్భుత ఇన్నింగ్స్

2017 ఆగస్టులో శ్రీలంకతో రెండో వన్డేలో 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది భారత్‌. ఓపెనర్లు తొలి వికెట్​కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలర్​ అఖిల ధనుంజయ 6 వికెట్లు తీయడం వల్ల 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమ్ఇండియా. ఈ దశలో టెయిలెండర్లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన ధోనీ.. అపూర్వ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 45, భువనేశ్వర్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ధోనీ ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది..!

2019 ప్రపంచకప్‌లో ధోనీ నిదానంగా ఆడాడన్న విమర్శలు వినిపించాయి. సెమీస్‌లో భారత్ ఓడిన మ్యాచ్‌లోనూ జడేజాలో స్ఫూర్తి నింపుతూ అతడితో భారీ ఇన్నింగ్స్ ఆడించాడు. చివర్లో రనౌటై నిష్క్రమించాడు. లేకుంటే భారత్‌ను ఫైనల్ చేర్చేవాడేమో. ఆ మ్యాచ్​లో ధోనీ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చుంటే ఫలితం మరోలా ఉండేడదని సీనియర్లు అభిప్రాయపడ్డారు.

ధోనీ నమ్మకాన్ని నిలబెట్టిన జోగిందర్

లక్ష్యాన్ని కాపాడుకోవడంలోనూ ధోనీ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. తను కెప్టెన్సీ వహించిన తొలి ఐసీసీ టోర్నీ 2007 టీ20 ప్రపంచకప్​. ఇందులో తనదైన వ్యూహాలతో భారత్‌ను ఫైనల్ చేర్చాడు మహీ. పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో​ జోగిందర్​ శర్మకు చివరి ఓవర్​ బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్​ నమ్మకాన్ని నిలబెట్టుకున్న శర్మ.. భారత్‌ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

బౌలర్లు ధోనీ సలహా తీసుకోవాల్సిందే..!

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏ బంతి వేస్తే దొరుకుతాడో బౌలర్‌కు చెప్పడం ద్వారా అనేక సార్లు వారికి సహకరించాడు. ధోనీ చెప్పినమాట వినే 2019 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసినట్టు బౌలర్ షమీ చెప్పాడు. కుల్‌దీప్‌, చాహల్‌, ఇర్ఫాన్ పఠాన్‌, జడేజా సహా ఎంతో మంది బౌలర్లు తాము బౌలింగ్‌ వేస్తున్న సమయంలో మహీ సలహాలు పాటించే వాళ్లమని తరచూ చెబుతుంటారు.

డీఆర్​ఎస్​ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్

భారత బ్యాట్స్​మెన్ యువరాజ్‌ సింగ్, సురేశ్​ రైనాను.. బ్యాట్స్‌మన్​గానే కాకుండా బౌలర్‌గానూ సమర్థంగా వినియోగించుకున్నాడు ధోనీ. ఎల్బీడబ్ల్యూల విషయంలో కచ్చితత్త్వం కోసం తీసుకొచ్చిన డీఆర్​ఎస్​ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేంతగా ఉపయోగించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.