ETV Bharat / sitara

కేటీఆర్​ను ఆశ్రయించిన రష్మి.. సాయం చేయాలంటూ వినతి!

author img

By

Published : Jul 30, 2021, 9:58 AM IST

'జబర్దస్త్' యాంకర్ రష్మి.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శునకాల దుస్థితిని మంత్రి కేటీఆర్​కు దృష్టికి తీసుకువెళ్లింది. జంతు పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఆమె.. యానిమల్ బర్త్​ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటిని రోడ్లపై వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని సూచించింది.

rashmi
రష్మీ

బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి.. జంతు ప్రేమికురాలనే విషయం చాలామందికి తెలుసు. మూగ జీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది. ఇప్పుడు రష్మి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారంటూ.. దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

గతం కొంతకాలంగా హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే విడిచిపెడుతున్నారు. అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా 'సేవ్‌యానిమల్స్‌ఇండియా' అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు.

ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేటీఆర్‌ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.