ETV Bharat / opinion

Cop26 Summit: వాతావరణ మార్పుల కట్టడిలో చేతలు కావాలి!

author img

By

Published : Nov 13, 2021, 7:36 AM IST

Updated : Nov 13, 2021, 9:10 AM IST

Climate Change
వాతవరణ మార్పులు

యూకేలోని గ్లాస్గో నగరం ఆతిథ్యమిచ్చిన 'కాప్‌ 26' విశ్వసదస్సులో(Cop26 Summit) వాతావరణ మార్పుల(Climate Change) కట్టడి దిశగా వాగ్దానాలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు వందల దేశాలకు చెందిన పాతిక వేల మంది ప్రతినిధులు సాగించిన చర్చోపచర్చలు, దేశాధినేతల ప్రసంగాల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే.. దేశాలన్నీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఉష్టోగ్రతల(Global Warming) పెరుగుదల నుంచి పుడమికి విముక్తి లభిస్తుంది.

ఏడేళ్లుగా చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Global Warming) నమోదవుతున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రపంచ వాతావరణ సంస్థ- భూగోళం భవిష్యత్తు అగమ్యగోచరమవుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. కర్బన ఉద్గారాల కట్టడి ప్రణాళికలు సత్వరం కార్యరూపం దాల్చకపోతే- 2100 నాటికి భూతాపం 2.7 డిగ్రీల వరకు పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉందని 'సీఏటీ' (క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌) తాజాగా హెచ్చరించింది. వాతావరణ మార్పుల(Climate Change) విపరిణామాలుగా విరుచుకుపడుతున్న విపత్తులపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. వారి వేడుకోళ్లన్నీ అరణ్యరోదనలే అవుతున్న దుస్థితిలో- యూకేలోని గ్లాస్గో నగరం ఆతిథ్యమిచ్చిన 'కాప్‌ 26' విశ్వసదస్సులో వాగ్దానాలు(Climate Change Cop26) వెల్లువెత్తాయి. దాదాపు రెండు వందల దేశాలకు చెందిన పాతిక వేల మంది ప్రతినిధులు సాగించిన చర్చోపచర్చలు, దేశాధినేతల ప్రసంగాల్లో(Cop26 Summit) అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

పాశ్చాత్య దేశాల పెడధోరణులే..

గడచిన మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల ఎకరాల్లో అడవులు అదృశ్యమయ్యాయి. వనాల విధ్వంసకాండను 2030 నాటికి పూర్తిగా నివారించేందుకు వందకు పైగా దేశాలు ప్రతినబూనడాన్ని సహర్షంగా స్వాగతించాలి! కాలుష్యకారకమైన బొగ్గు వినియోగాన్ని నియంత్రించే ప్రణాళికలపై ఆ సమష్టితత్వం కొరవడటమే ఆందోళనకరం. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా వ్యవహరిస్తున్న అమెరికా, చైనాలు- భూ ఉష్ణోగ్రతల ఊర్ధ్వగమనాన్ని నిలువరించేందుకు చేతులు కలపడం కీలక పరిణామం! వినాశకర మీథేన్‌ వాయు ఉద్గారాలను 2030 కల్లా 30శాతం తగ్గించడానికి దాదాపు వంద దేశాలు అంగీకరించాయి. నెట్‌జీరో (కర్బన ఉద్గార తటస్థత) సాధనా లక్ష్యాల నిర్దేశంలో వర్ధమాన దేశాల పట్ల సంపన్న రాజ్యాలు దుర్విచక్షణ కనబరుస్తున్నాయని ఆగ్రహిస్తూ- దాన్ని 'కర్బన వలసవాదం'గా ఇండియాతో పాటు 22 దేశాలు(Cop26 Summit) అభివర్ణించాయి. ప్రపంచ వనరుల్లో దాదాపు మూడు వంతులను తామే వినియోగించుకుంటూ కర్బన ఉద్గారాలను విచ్చలవిడిగా వెదజల్లుతున్న పాశ్చాత్య దేశాల పెడధోరణులే ధరణికి పెనుశాపాలవుతున్నాయి!

2070 కల్లా నెట్‌జీరోకు..

వాతావరణ మార్పులకు ఎదురీదుతున్న పేద, వర్ధమాన దేశాలకు ఏటా పదివేల కోట్ల డాలర్లను సమకూరుస్తామని సంపన్న రాజ్యాలు లోగడ హామీ ఇచ్చాయి. ఆ మాటను నిలబెట్టుకోవడంలో వాటి వైఫల్యాన్ని తూర్పారబట్టిన ఇండియా- భూతాప నియంత్రణకు సంబంధించి తన ప్రణాళికల అమలుకు రెండున్నర లక్షల కోట్ల డాలర్లు అత్యవసరమని వెల్లడించింది. 2030 నాటికి దేశానికి అవసరమైన విద్యుత్తులో యాభైశాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకుంటామని ప్రధాని మోదీ స్పష్టీకరించారు. 2070 కల్లా నెట్‌జీరోను(India Carbon Emissions) సాధిస్తామని గ్లాస్గో వేదికపై ఆయన ప్రకటించారు. ప్రపంచానికి పొగపెడుతున్న శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు ఇండియా లోగడే అంతర్జాతీయ సౌరశక్తి కూటమికి(International Solar Alliance) రూపకల్పన చేసింది. అందులో 101వ సభ్యదేశంగా అమెరికా భాగస్వామి కావడం- హరిత ఇంధన లక్ష్యాలకు కొత్త వెలుగులద్దే ఆశావహ పరిణామమే! భూతాప పర్యవసానాలను తట్టుకునేలా చిన్న ద్వీపదేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉద్దేశించిన 'ఐరిస్‌' సైతం అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను పెంచే మేలిమి పథకమే!

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉద్ఘాటించినట్లు- పోనుపోను రుజాగ్రస్తమవుతున్న భూమాతను రక్షించుకోవడంలో సమష్టి కార్యాచరణే కీలకం. వ్యవసాయం నుంచి ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి ప్రణాళికల వరకు అన్నింటిపైనా పెనుప్రభావం చూపించే భూతాపాన్ని కట్టడి చేయాలంటే- ప్యారిస్‌ ఒప్పందం(Paris Accord) అమలుకు అన్ని దేశాలూ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. బలమైన రాజకీయ సంకల్పం, సమర్థ సమన్వయంతో దేశాధినేతలు ముందడుగు వేస్తేనే- భావితరాలు ధరిత్రిపై చల్లగా సేదతీరగలుగుతాయి!

ఇవీ చూడండి:

దట్టంగా అవినీతి కాలుష్యం- నిర్మూలనకు అదే మార్గం!

Climate change: పర్యావరణ స్పృహే పుడమికి రక్ష

అడవులకు పశు తాకిడి- హరించుకుపోతున్న పచ్చదనం

నీటి బొట్టును ఒడిసి పట్టు- కరవుకు చెక్​ పెట్టు!

Last Updated :Nov 13, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.