ETV Bharat / international

ఫుట్​బాల్ గ్రౌండ్​లో బాంబు పేలుడు.. 27 మంది మృతి.. చిన్నారులే ఎక్కువ!

author img

By

Published : Jun 10, 2023, 9:12 PM IST

Updated : Jun 10, 2023, 10:13 PM IST

somalia bomb attack today
somalia bomb attack today

21:03 June 10

ఫుట్​బాల్ గ్రౌండ్​లో బాంబు పేలుడు.. 27 మంది మృతి.. చిన్నారులే ఎక్కువ!

Somalia Bomb Attack : ఆఫ్రికా దేశం సొమాలియాలో పాత బాంబు అవశేషాలు పేలడం వల్ల 27 మంది మరణించారని ఓ అంతర్జాతీయ ప్రముఖ వార్థా సంస్థ నివేదించింది. లోయర్ షాబెల్లే ప్రాంతంలోని ఓ ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన ఈ పేలుడులో మృతి చెందిన వారిలో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనలో 53 మంది గాయపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిందీ పేలుడు.

తీవ్రవాదుల దాడిలో 9 మంది మృతి..
సోమాలియా రాజధాని మొగాడిషులో జరిగిన తీవ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి గాయాలయ్యాయని.. 84 మందిని రక్షించినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి.. ఓ హోటల్లోకి చొరబడిన ముష్కరులు కొన్ని గంటలపాటు దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. సోమాలియాకు చెందిన.. ఈ తీవ్రవాద సంస్థ.. మొగాడిషులోని హోటళ్లు, ప్రముఖ ప్రదేశాలపై అనేక సార్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది.

తుర్కియేలో పేలుడు.. ఐదుగురు మృతి
Explosion In Factory In Turkey : తుర్కియేలోని అంకారాలో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు మరణించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకారా వెలుపల 40 కిమీ దూరంలో MKE రాకెట్, పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ వద్ద పేలుడు జరిగిందని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. సదరు ఫ్యాక్టరీ డైనమైట్​ విభాగంలో కెమికల్​ ప్రయోగం వల్ల పేలుడు సంభవించిందని టెక్నికల్​ స్టాఫ్​​ తెలిపారని అంకారా ప్రావిన్స్​ గవర్నర్​ చెప్పారు.

ఆయిల్​ ట్యాంకర్​ పేలి 19 మంది మృతి..
Oil Tanker Explosion Afghanistan : ఇలాంటి ఘటన గతేడాది డిసెంబర్​లో అఫ్గనిస్థాన్​లో జరిగింది. సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు ఇంధన ట్యాంకర్​ పేలి దాదాపు 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న సలాగ్​ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. ప్రమాదానికి గురైనవారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంత మంది మాత్రం గుర్తుపట్టలేనంతగా గాయపడ్డారు. కాబుల్​కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఈ సలాగ్ టన్నెల్​ ఉంటుంది. ఆ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను ఇది కలుపుతుంది. సోవియట్​ యూనియన్​ సహాయంతో ఈ సొరంగ మార్గాన్ని 1960లో అఫ్గనిస్థాన్​ నిర్మించింది.

Last Updated :Jun 10, 2023, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.