ETV Bharat / international

వచ్చే 2 నెలల్లో తీవ్ర స్థాయికి కరోనా.. చైనాలో 30 రోజుల్లో 60 వేల మంది మృతి..!

author img

By

Published : Jan 14, 2023, 9:26 PM IST

covid deaths in china
చైనాలో కరోనా మహమ్మారి

కరోనా విస్ఫోటనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాకు తాజా అధ్యయనం మరింత భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈనెలాఖరు వరకు బీజింగ్‌లో దాదాపు అందరికీ వైరస్‌ సోకుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. జీరో కొవిడ్ ఆంక్షలను సడలించటం వల్ల వచ్చే 2, 3నెలల్లో కొవిడ్‌ తీవ్రస్థాయికి చేరుకుంటుందని నిపుణుల అంచనావేశారు. ఇదిలా ఉండగా గత నెలలో దాదాపు 60,000 మంది కొవిడ్​తో మృతి చెందినట్లు చైనా నేషనల్​ హెల్త్​ కమిషన్ వెల్లడించింది.​

ప్రజా ఆందోళనలతో జీరో కొవిడ్ విధానాన్ని ఉపసంహరించుకున్న చైనాకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే వైరస్‌ విశ్వరూపం చూపిస్తుండగా తాజాగా విడుదలైన అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈనెలాఖరుకు బీజింగ్‌లో దాదాపు అందరికీ వైరస్‌ సోకుతుందని ఓ అధ్యయనాన్ని నేచర్‌ మెడిసిన్ జర్నల్‌ ప్రచురించింది.

2.2 కోట్ల మంది జనాభా కలిగిన బీజింగ్‌లో డిసెంబర్‌ నాటికే 76 శాతం మంది వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనం తెలిపింది. ఈనెలాఖరు నాటికి వైరస్ బాధితులు 92 శాతానికి పెరుగుతారని వెల్లడించింది. జీరో కొవిడ్ విధానాన్ని సడలించడం వల్ల వైరస్ పునరుత్పత్తి రేటు 3.44 కు పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. అంటే వైరస్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి మరో 3.44 మందికి మహమ్మారి సోకుతుందని పేర్కొంది. ఆంక్షలు సడలించినప్పటి నుంచి బీజింగ్‌ సహా చైనాలో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్ రోగులతో ఆస్పత్రులు, శ్మశానవాటికలు నిండిపోయాయన్న వార్తలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు తెలిపింది.

covid deaths in china
కొవిడ్​తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

చైనాలో జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే న్యూ ఇయర్, స్ప్రింగ్ ఫెస్టివల్ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని కేసులు పెరుగుతాయని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జెంగ్‌ గ్వాంగ్ హెచ్చరించారు. చైనాలో వచ్చే 2,3 నెలల్లో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇది గ్రామీణ ప్రాంతాలపై వైరస్‌ తీవ్రప్రభావం చూపుతుందని తెలిపారు. ఇప్పటివరకు నగరాలపైనే దృష్టి సారించిన చైనా ప్రభుత్వం ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది చైనీయులకు సరైన వైద్య సదుపాయాలు లేవని.. ఇది దేశంలో కొవిడ్ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని అంటువ్యాధుల నిపుణుడు హెచ్చరించారు.

covid deaths in china
ఆస్పత్రి ఆవరణంలో కొవిడ్​ రోగులు

కొవిడ్​తో 60,000 మంది మృతి..
చైనాలో గత నెల రోజుల్లో దాదాపు 60,000 మంది కరోనాతో మరణించారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కొవిడ్ కేసులు, మరణాలపై పారదర్శకంగా సమాచారం ఇవ్వడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచదేశాల నుంచి విమర్శలు రావటం వల్ల చైనా నేషనల్‌ హెల్త్ కమిషన్‌ ఈ గణాంకాలను విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435 మంది మరణించినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. మృతుల సగటు వయసు 80 ఏళ్లుగా పేర్కొంది. మరణించిన వారిలో 90 శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది.

covid deaths in china
కొవిడ్​ రోగులకు నిండిన ఆస్పత్రులు

పీకింగ్​ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023 జనవరి 11 నాటికి చైనాలో దాదాపుగా 900 మిలియన్ల మంది ఈ వైరస్​ బారిన పడినట్లు తెలిపింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్​ సోకినట్లు అంచనా వేసింది. ఈ అధ్యయనం గాన్సూ రాష్ట్రంలో 91 శాతం మంది ప్రజలకు ఆ వైరస్ ​సోకి అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. యున్నాయ్​ 84 శాతం, కింగ్ హై 80 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నట్లు నివేదించింది. ఒమిక్రాన్ ఉప వేరియంట్​ బి.ఎఫ్.7​ ద్వారా దెబ్బతిన్న బీజింగ్, ఏడు మరణాలను ప్రకటించింది. అయితే ఆ తర్వాత కేసులు, మరణాల డేటాను ప్రకటించడం ఆపివేసింది. శ్వాసకోశ సమస్యతో మరణించిన కోవిడ్ రోగులను మాత్రమే అధికారిక మరణాల సంఖ్యగా లెక్కించనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.

covid deaths in china
చైనాలో విలయతాండవం సృష్టిస్తున్న కరోనా
covid deaths in china
బీజింగ్​లో కొవిడ్​ కల్లోలం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.