ETV Bharat / international

Afghan Taliban : తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్​-చైనా విశ్వప్రయత్నాలు!

author img

By

Published : Sep 14, 2021, 1:32 PM IST

Afghan Taliban
తాలిబన్‌కు ఐరన్‌ బ్రదర్స్‌ అండ దండలు..!

అఫ్గాన్​ను​ తాలిబన్లను ఆక్రమించుకోవడం వెనుక పాక్ కుట్ర ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. తాలిబన్లు(Afghan Taliban) అధికారం చేపట్టాక తొలి వాణిజ్య విమానం సోమవారం కాబుల్‌లో(Kabul Airport) ల్యాండ్‌ అయ్యింది. అది పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ విమానం కావడమే ఇందుకు నిదర్శనం. తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్​ ఈ ప్రయత్నాలు చేస్తోంది. అటు చైనా కూడా వీరికి అండదండగా నిలుస్తోంది.

అమెరికా సైనికులు స్వదేశానికి చేరారు. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించి(Afghan Crisis) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అఫ్గాన్‌ యుద్ధంలో గత 20 ఏళ్లలో పాక్‌పాత్రపై అమెరికా అధ్యయనం చేస్తుందట..! తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిలో తాలిబన్లకు పాక్‌ ఆశ్రయమిచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్‌ పోషించాల్సిన పాత్ర, ఆ దేశంతో సంబంధాలపై పునర్‌ విశ్లేషించుకొంటామని తెలిపారు. అఫ్గానిస్థాన్‌ విషయంలో పలు అవసరాలు ఆ దేశానికి ఉన్నాయని.. వాటిల్లో కొన్ని అమెరికా లక్ష్యాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌పై గత నెలలో ప్రారంభమైన కాంగ్రెస్‌ విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం ఇప్పటివరకు ఇమ్రాన్‌ ఖాన్‌కు ఫోన్‌ చేయలేదు. ఐరన్‌ బ్రదర్స్‌గా పేరున్న పాక్‌-చైనా ద్వయం తాలిబన్లకు అన్ని విధాల అండగా నిలుస్తోంది.

పాక్‌ డబుల్‌ గేమ్‌..

తాలిబన్లు(Afghan Taliban) అధికారం చేపట్టాక తొలి వాణిజ్య విమానం సోమవారం కాబుల్‌లో(Kabul Airport) ల్యాండ్‌ అయ్యింది. అది పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ విమానం కావడం విశేషం. పలువురు జర్నలిస్టులను అఫ్గాన్‌కు తీసుకెళ్లింది. ఒక రకంగా తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్‌ చేస్తోన్న ప్రయత్నం ఇది. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ చీఫ్‌ కీలక పాత్ర పోషించిన విషయం కూడా చూశాం.

తాలిబన్లు(Taliban News) పుట్టిన వెంటనే బలపడటానికి పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతే కారణం. తొలిసారి తాలిబన్లు అఫ్గాన్‌లో రాజ్యమేలినప్పుడు గుర్తింపునిచ్చిన మూడు దేశాల్లో పాక్‌ కూడా ఒకటి. ఆ తర్వాత ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అఫ్గానిస్థాన్‌లోకి అమెరికా సేనలు అడుగుపెట్టాయి. వెంటనే ప్లేటు ఫిరాయించిన పాక్‌ ఈ పోరులో తనను తాను అమెరికా మిత్రదేశంగా చెప్పుకొంది. కానీ, అఫ్గాన్‌లో పాక్‌ ప్రాధాన్యం కోల్పోకుండా ఆ దేశ సైన్యం, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో కొన్ని వర్గాలు మాత్రం తాలిబన్లకు నిరాటంకంగా ఆయుధాలు, రవాణా సౌకర్యాలు కల్పించాయి. అఫ్గాన్‌ పౌర ప్రభుత్వం భారత్‌ అనుకూల విధానాలు అవలంబిస్తోందనే అనుమానాలతో ఇలా చేసింది. ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించగానే 'అఫ్గాన్‌ బానిస సంకెళ్లను తెంపుకొంది' అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఏకంగా హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో చైనాతో తాలిబన్ల సంబంధాలు మెరుగుపడటానికి కూడా పాకిస్థానే కారణమనే ప్రచారం ఉంది. కానీ, డ్యూరాండ్‌ లైన్‌ విషయంలో మాత్రం తాలిబన్లు తమపై తిరగబడతారనే భయం పాక్‌లో అంతర్గతంగా ఉంది.

అఫ్గాన్‌కు డ్రాగన్‌ కౌగిలి..

సోవియట్‌ ఆక్రమణ సమయంలో పాక్‌తో కలిసి ముజాహిద్దీన్‌లకు చైనా ఆయుధాలను సరఫరా చేసింది. చైనా-తాలిబన్‌(China Taliban) సంబంధాలు 2000 సంవత్సరంలో మొదలయ్యాయి. ఆ ఏడాది పాక్‌లోని చైనా మాజీ రాయబారి లూ షులిన్‌ తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం కూలాక పౌర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకొంది. పరిస్థితులు మారేకొద్దీ తాలిబన్ల వైపు మొగ్గింది. పాకిస్థాన్‌ సాయంతో 2019 నుంచి చైనా తాలిబన్లకు దగ్గరవుతూ వచ్చింది. అదే ఏడాది తాలిబన్‌ బృందం బీజింగ్‌ను సందర్శించి చర్చలు జరిపింది. అంతేకాక ముల్లా బరాదర్‌ నేతృత్వంలోని బృందం కూడా చైనాతో భేటీ అయ్యింది. ఈ క్రమంలో తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించాక కూడా చైనా రాయబార కార్యాలయం కొనసాగింది. ఆ తర్వాత తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాలో చైనా పేరు కూడా చేర్చింది. ఇటీవలే చైనా 30 మిలియన్‌ డాలర్ల సాయం కూడా ప్రకటించింది.

తాలిబన్లకు చైనా మద్దతు చాలా అవసరం. ఎందుకంటే ఆంక్షల జాబితాలో ఉన్న ఇరాన్‌, ఉ.కొరియా వంటి దేశాలకు చైనా మద్దతు అందుతోంది. అలానే ఇప్పటికైతే తాలిబన్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణ అవసరాలు తీర్చడానికి చైనాతో సంబంధాలు చాలా ముఖ్యం. అంతేకాదు చైనా వద్ద భద్రతా మండలి ‘వీటో’ శక్తి ఉంది. ఇది భవిష్యత్తులో తాలిబన్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.

అఫ్గాన్‌లో అమెరికా సేనలు ఉండటం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తాలిబన్లకు సాయం చేసింది. దీంతోపాటు అఫ్గాన్‌లోని కీలకమైన రాగి, రేర్‌ఎర్త్‌ మెటల్స్‌ను కూడా సొంతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. వీటి విలువ లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అంతేకాదు.. వీఘర్‌ ముస్లింలకు మద్దతుగా ఈస్ట్‌ తుర్కెమెనిస్థాన్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌(ఈటీఐఎం)కు తాలిబన్లు మద్దతు ఇవ్వకుండా చూడటమే లక్ష్యం. ఇప్పటికే అఫ్గాన్‌లోని బదాక్షన్‌ ప్రావిన్స్‌లో ఈటీఐఎంకు చెందిన దాదాపు 700 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా.

అమెరికా సేనలు అఫ్గానిస్థాన్‌లో ఉండటం భారత్‌ ప్రయోజనాలను కాపాడుతుంది. అదే సమయంలో చైనాను కూడా అదుపులో పెట్టింది. ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు అక్కడకు చేరుకొనే ప్రమాదం పొంచి ఉంది.

ఇదీ చదవండి: ప్రపంచ దేశాల ఉదారత- అఫ్గాన్​కు 1.2 బిలియన్ డాలర్ల సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.