ETV Bharat / international

కరోనా వేరియంట్ల విజృంభణ- 5లక్షలకుపైగా కొత్త కేసులు

author img

By

Published : Aug 10, 2021, 9:51 AM IST

కొత్త వేరియంట్ల విజృంభణతో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రపంచంపై విరుచుకుపడుతోంది. అమెరికాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 5లక్షల మందికిపైగా వైరస్​ విస్తరించింది.

Corona virus outbreak
కరోనా వైరస్​, కొత్త కేసులు

వ్యాక్సిన్ల రాకతో కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో కీలక ముందడుగు పడింది. అయితే.. కొత్త కొత్త రూపాలతో కోరలు చాస్తోంది ఈ మహమ్మారి. డెల్టా, డెల్టా ప్లస్​ వంటి వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ లక్షల కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 5 లక్షలకుపైగా మందికి వైరస్​ సోకింది. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. డెల్టా వేరియంట్​ విజృంభణతో రోజుకు లక్ష మందికిపైగా వైరస్​ బారినపడుతున్నారు. సోమవారం 1,02,375 కొత్త కేసులు వచ్చాయి. 329 మంది మరణించారు. 46వేల మంది కోలుకున్నారు.

అమెరికా ఆర్కాన్సస్​ రాష్ట్రంలో వైరస్​ ఉద్ధృతితో రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరారు. ఈ ఏడాది జనవరిలో వైరస్​ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికన్నా..ప్రస్తుతం ఒక్కరోజులో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,376 మంది ఆసుపత్రులకు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 ఐసీయూ పడకలు మాత్రమే ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 509 మంది ఐసీయూలో ఉండగా.. 286 మంది వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు.

వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న టాప్​ 5 దేశాలు..

  • ఇరాన్​: అగ్రరాజ్యం తర్వాత వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది ఇరాన్​లోనే. ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వైరస్​ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 40వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి 588 మంది మరణించారు. 26వేల మంది వైరస్​ను జయించారు.
  • బ్రిటన్​: డెల్టా వేరియంట్​ వ్యాప్తి బ్రిటన్​లో అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజే 25వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 25వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • టర్కీ: దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించిన క్రమంలో వైరస్​ మళ్లీ పుంజుకుంటోంది. సోమవారం కొత్తగా 23వేల కేసులు నమోదయ్యాయి. 117 మంది మరణించారు.
  • రష్యా: కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కొత్త కేసులు 20వేల లోపునకు దిగటం లేదు. సోమవారం కొత్తగా 22వేల మందికి వైరస్​ సోకింది. 769 మంది మరణించారు.
  • ఇండోనేసియా: కరోనా కేసులు అదుపులోకి వచ్చినా.. మరణాలు తగ్గటం లేదు. సోమవారం 20వేల కేసులు వెలుగు చూడగా.. 1,475 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. మరో 44 వేల మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.