కరోనా వ్యాక్సినేషన్పై ప్రభుత్వం, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. కొందరిలో చైతన్యం రావడం లేదు. కొవిడ్ టీకాపై అపోహ పోవడం లేదు.
కరోనా వ్యాక్సిన్ వేసుకోమన్నందుకు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శవిప్రకాశ్(22) కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వచ్చాడు. మణికొండలో నివాసముంటున్న ప్రకాశ్.. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసుకోమని సూచించగా.. తీసుకున్నట్లు చెప్పాడు. అబద్ధం చెబుతున్నాడని గ్రహించి శవిప్రకాశ్ను మందలించారు. కొవిడ్ టీకా తీసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశారు. భయంతో ఏం చేయాలో పాలుపోక శనివారం రాత్రి.. పురుగుల మందు తీసుకుని శవిప్రకాశ్ బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆదివారం ఉదయం వారి ఇంటి పక్కనే శవిప్రకాశ్ నురగలు కక్కుతూ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
- ఇదీ చదవండి : కరోనా అనంతరం తలెత్తే జబ్బులను ఎదుర్కోండిలా..