ETV Bharat / crime

cyber fraud: సరుకుల పేరుతో సైబర్ మోసం.. నిందితుడు అరెస్ట్

author img

By

Published : Jul 24, 2021, 7:24 AM IST

cyber fraud
సైబర్ మోసం

ఆన్‌లైన్‌లో నిత్యావసర సరకులు విక్రయించే నకిలీ వెబ్​సైట్ సృష్టించాడో ఓ మోసగాడు. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అందులో ప్రకటనలిచ్చాడు. రాయితీకి వస్తువులను ఇంటి వద్ద అందిస్తామని ప్రకటనలు చూసిన వినియోగదారులు ఆన్ లైన్​లో డబ్బులు చెల్లించారు. రోజులు గడిచినా.. సరుకులు ఇంటికి చేరకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నాం. తినే ఆహారం నుంచి వాడే ఫోన్‌ వరకు అన్నింటినీ ఇంటివద్దకే తెప్పించుకుంటున్నాం. ఇదే విధంగా మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా కారణంగా బయటికి వెళ్లలేక ఆన్‌లైన్‌లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని వెబ్‌సైట్లు వెతికాడు. "జాప్ నౌ" సైట్‌లో ఏప్రిల్ 28న సరకులు కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా సరుకులు రాకపోవడంతో వెబ్‌సైట్‌లో ఉన్న మెయిల‌్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవటంతో మోసం జరిగిందని గ్రహించి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్‌సైట్ ఐపీ అడ్రస్ ఆధారంగా బెంగళూర్‌లో ఉన్న నిందితుడు రిషబ్‌ ఉపాధ్యాయ్​ని అరెస్ట్ చేశారు.

'ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిషబ్ ఉపాధ్యాయ్ బెంగళూరులో వెబ్‌సైట్‌ రూపకల్పనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత వివిధ సంస్థలకు వెబ్‌సైట్‌లు రూపొందించేవాడు. తాను వేరొకరికి రూపొందించి ఇచ్చిన వెబ్‌సైట్‌ ద్వారా వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసాలు చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో రిషబ్ కూడా సులభంగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ వెబ్ సైట్లు రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పంజాబ్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు రాహుల్ సాయంతో.. అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి చాలా మంది వద్ద డబ్బులు, బ్యాంక్‌ ఖాతాలు, ధ్రువపత్రాలు తీసుకున్నాడు. ఆ తర్వాత "రేజర్‌ పే" యాప్‌ ద్వారా తన ఖాతాలో డబ్బులు జమచేయించుకున్నాడు. రిషబ్‌ వ్యవహారం తెలిసిన తర్వాత బాధితులకు సంబంధించిన 20 లక్షలను నిలిపేశాం. అనంతరం ఫర్నీచర్ విక్రయాల పేరుతో మరో వెబ్‌సైట్‌ రూపొందించి మరిన్ని మోసాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో వెల్లడైంది.'

-సజ్జనార్, సైబరాబాద్ సీపీ

ఫిర్యాదు చేయండి

హైదరాబాద్‌, బెంగళూర్‌కు చెందిన చాలా మంది ఈ నకిలీ వెబ్‌సైట్లలో డబ్బులు చెల్లించి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని దేశంలో ఎక్కడినుంచైనా.. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.

రిషబ్‌ను అరెస్ట్ చేసి 40 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న రాహుల్ కోసం గాలిస్తున్నారు. ఎంతమందిని మోసం చేసి డబ్బులు వసూలు చేశాడన్న వివరాలు దర్యాప్తులో తెలుసుకుని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.