ETV Bharat / city

తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఈనెల 30న మినీ సంగ్రామం

author img

By

Published : Apr 15, 2021, 3:26 PM IST

రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానుంది. వరంగల్, ఖమ్మం నగరపాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఒక్కొక్క వార్డుకు కూడా అదే రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు. రేపట్నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా... వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించాలని... పోలింగ్​కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

municipal elections
కార్పొరేషన్లు

గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. రెండు నగరపాలికలు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలసంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపు స్థానికంగా ఆయా పట్టణాల్లో ఎన్నిక కోసం నోటీసు జారీ చేస్తారు. రేపట్నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీన పరిశీలన చేపడతారు. ఎక్కడైనా నామినేషన్లు తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే 20న అప్పీలు చేసుకోవచ్చు. సదరు అప్పీళ్లను 21వ తేదీన పరిష్కరించాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువుంటుంది. అదే రోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. ఈ నెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మే రెండో తేదీన నిర్వహిస్తారు. మే మూడో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఎక్కడెన్ని వార్డులు

గ్రేటర్ వరంగల్​లో 66, ఖమ్మం నగరపాలికలో 60 డివిజన్లున్నాయి. సిద్దిపేటలో 43, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12, నకిరేకల్​లో 20 చొప్పున వార్డులున్నాయి. మొత్తం ఏడు చోట్ల 248 వార్డులకు గాను 1,532 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్​లో 6,52,966 మంది ఓటర్లు, ఖమ్మంలో 2,81,387 మంది ఓటర్లున్నారు. సిద్దిపేటలో 1,00,653 మంది, అచ్చంపేటలో 20,529 మంది, జడ్చర్లలో 41,515 మంది, కొత్తూరులో 8,136 మంది, నకిరేకల్​లో 21,035 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 11,26,221 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఖాళీలు ఉన్న చోట ఎన్నికలు

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న తొమ్మిది డివిజన్లకు కూడా ఈ షెడ్యూల్​తో పాటే ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్​తో పాటు గజ్వేల్, నల్గొండ, జల్​పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్​పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరుగుతాయి. జీహెచ్ఎంసీకి చెందిన లింగోజిగూడ డివిజన్లో మాత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. మిగతా అన్ని చోట్లా 22వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ సహా ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు ఎస్ఈసీ ప్రకటించింది.

వారికి పోస్టల్ బ్యాలెట్​

ఎన్నికల ప్రక్రియలో కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇంటింటి ప్రచారం సమయంలో ఐదుగురి కంటె ఎక్కువ మంది కలిసి తిరగరాదని... వాహనాల కాన్వాయ్ ఉంటే ప్రతి రెండు వాహనాల తర్వాత కనీసం పది మీటర్ల దూరం ఉండాలని స్పష్టం చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు కరోనా నిబంధనలకు లోబడే జరగాలని పేర్కొంది. పోలింగ్ సిబ్బందితో పాటు దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వారికి, కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. పోలింగ్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని, భౌతికదూరం పాటించాలని... మాస్కులు లేకుండా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరాదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, కరోనాపై అవగాహన కల్పించే పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.

రిజర్వేషన్లు ఖరారు

ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల సమక్షంలో కలెక్టర్లు లాటరీ తీశారు. అటు కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల ఛైర్​పర్సన్ పదవుల మహిళా రిజర్వేషన్ల కోసం పురపాలకశాఖ సంచాలకులు సత్యనారయణ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీశారు. జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు, నకిరేకల్ బీసీ జనరల్​కు రిజర్వ్ అయ్యాయి. అందుకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇదీ చదవండి: ఆ 14 గంటలు ఆర్​టీజీఎస్​ సేవలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.