ETV Bharat / city

ఆ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులివ్వడంలేదు: కేంద్ర రైల్వే మంత్రి

author img

By

Published : Jul 28, 2022, 11:46 AM IST

ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కాస్ట్‌ షేరింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించాల్సి ఉందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ అన్నారు. ఇప్పటికే రూ.1,798 కోట్ల పెండింగ్‌ ఉందని తెలిపారు. బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాస్ట్‌ షేరింగ్‌ విధానం కింద చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,798 కోట్లు చెల్లించాల్సి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కష్టమవుతోందని స్పష్టం చేశారు. మచిలీపట్నం-రేపల్లె మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం గురించి బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో రూ.70,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను ఇవ్వలేకపోతోందని... ఇప్పటికే రూ.1,798 కోట్ల పెండింగ్‌ ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొత్త ప్రాజెక్టూ చేపట్టడం సాధ్యం కాదని అందువల్ల ఎంపీ తన పరపతిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా ఇచ్చేలా నచ్చజెబితే గొప్ప సాయం చేసినవారవుతారని పేర్కొన్నారు. అప్పుడు ఏపీలో ప్రాజెక్టుల వేగం పెంచడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి మచిలీపట్నం మధ్య కొత్త రైలు ప్రారంభం గురించి బాలశౌరి అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ.. సాధారణంగా కొత్త రైళ్లను అక్కడున్న ట్రాక్‌ సామర్థ్యం ప్రకారం ప్రవేశపెడుతుంటామని, ఎంపీ తన కార్యాలయానికి వస్తే ట్రాక్‌ సామర్థ్యంపై చర్చించి వీలుంటే పరిశీలిస్తామని తెలిపారు.

విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు డబ్లింగ్‌ ప్రాజెక్టు గురించి సమాధానమిస్తూ.. ‘221 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును రూ.4,106 కోట్లతో చేపట్టాం. 50% వాటా ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.289 కోట్లే డిపాజిట్‌ చేసింది. ఈ మార్గంలో 221 కిలోమీటర్ల డబ్లింగ్‌ పూర్తయింది. మిగిలిన 40 కిలోమీటర్ల విద్యుదీకరణ మొదలుపెట్టాం’ అని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

ఖరగ్‌పుర్‌-విజయవాడ ఫ్రైట్‌ కారిడార్‌పై సర్వే: ఖరగ్‌పుర్‌-విజయవాడల మధ్య తలపెట్టిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ఫ్రైట్‌ కారిడార్‌పై సర్వే, డీపీఆర్‌ తయారీ మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆయన బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.