పరిషత్ ఎన్నికల విషయంలో ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్వయించుకున్నారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. తీర్పును అవగాహన చేసుకోవటంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలా అన్వయించుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
సుప్రీం స్పష్టంగా చెప్పినా..
నాలుగు వారాల సమయం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పులో స్పష్టంగా చెప్పిందని హైకోర్టు వెల్లడించింది. సుప్రీం ప్రతి.. ఆంగ్ల భాష తెలిసిన ప్రతి సామాన్యుడికీ అర్థం అవుతుందని వివరించింది. ప్రస్తుత ఎస్ఈసీ గతంలో సీఎస్గానూ పనిచేశారని.. సుప్రీం తీర్పును సరిగా అర్థం చేసుకోకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
అర్హతపై ఆలోచించాలి..
ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆమె అర్హతపై ఆలోచించాల్సివస్తుందని సుప్రీం వ్యాఖ్యానించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నీలం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని తప్పుబట్టింది.
అలా ఎలా చేస్తారు ? హైకోర్టు
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే పూర్తి విరుద్ధమని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు హరించుకుపోతాయని హితవు పలికింది.
ఇవీ చూడండి : ధాన్యం అమ్ముకోలేక రైతుల గోస