ETV Bharat / city

నేటి నుంచే మహానాడు.. పసుపు పండుగకు అంతా రెడీ

author img

By

Published : May 27, 2022, 8:12 AM IST

TDP Mahanadu 2022 : పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు ఆన్​లైన్​కే మహానాడు పరిమితం కావటం, సుదీర్ఘ విరామం తర్వాత భౌతికంగా నిర్వహిస్తున్న మహానాడు వేదికగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం సమరశంఖం పూరించబోతోంది. నాయకుల్ని, కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యంగా నేటి నుంచి రెండ్రోజులు జరిగే మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై భారాలను మహానాడు వేదికగా ఎండగట్టనున్నారు.

TDP Mahanadu 2022
TDP Mahanadu 2022

నేటి నుంచే మహానాడు.. పసుపు పండుగకు అంతా రెడీ

TDP Mahanadu 2022 : "తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా..!" అని ఎన్టీఆర్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించి యావత్‌ తెలుగుజాతి ఉవ్వెత్తున కదిలి నాలుగు దశాబ్దాలైంది. ఎన్నో ఘన విజయాల్ని, అంతలోనే ఎదురు దెబ్బల్ని, ఉత్థాన పతనాల్ని చవిచూస్తూ, కాలంతో పాటు రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుల్ని తట్టుకుంటూ ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్లపాటు అప్రతిహత ప్రయాణం సాగించడం, అలుపెరగని పోరాటం చేయడం ఆషామాషీ ఏమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి సవాల్‌ విసిరి, రాష్ట్ర రాజకీయాలకు కొత్త గమనాన్నీ, ఒరవడినీ నేర్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోంది.మారిన రాజకీయ పరిస్థితులవల్ల ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా నాయకుల్ని, కేడర్‌ను కార్యోన్ముఖుల్ని చేయడం.., ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటి నుంచే సమరశంఖం పూరించడమే లక్ష్యంగా ఒంగోలులో 'మహానాడు'ని నిర్వహిస్తోంది.

TDP Mahanadu ay Ongole : 2009 ఎన్నికల వరకు తెలుగుదేశానికి కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. రాష్ట్ర విభజన తర్వాత.. 2014 ఎన్నికల నుంచి మరో ప్రాంతీయ పార్టీ వైకాపాతో తలపడాల్సి వస్తోంది. గతంలో గ్రామాల్లో వివిధ పథకాల కింద చేసిన పనులకు వైకాపా అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించకపోవడం, తెదేపా నాయకులు, కార్యకర్తల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం వంటివి అధికార పార్టీ ప్రత్యేక అజెండాగా అమలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని, కేడర్‌ను కాపాడుకోవడం తెదేపా అధినాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. అటు న్యాయపోరాటం, ఇటు క్షేత్రస్థాయి పోరాటాల ద్వారా... తెదేపా ఈ మూడేళ్లలో ఆ ఇబ్బందుల్ని అధిగమించగలిగింది. కేడర్‌లో స్థైర్యాన్ని నింపింది.

రహదారులు, కరెంటు కోతలు వంటి సమస్యలపైనా, ధరల పెరుగుదల, ఛార్జీల మోత, ప్రభుత్వం వేస్తున్న భారాలకు నిరసనగాను తెదేపా చేపట్టిన నిరసనలు, నెల రోజులకుపైగా నిర్వహించిన బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలకు ఇటీవల ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో... పార్టీ నాయకుల్లోను, కేడర్‌లోను కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీ అధికారం కోల్పోయాక కొన్ని చోట్ల స్తబ్దుగా ఉన్న నాయకులు కూడా... కేడర్‌లో ఉత్సాహం చూసి మళ్లీ క్రియాశీలంగా మారుతున్నారు. 2018 తర్వాత తెదేపా మళ్లీ ఇప్పుడే పార్టీ మహానాడుని బహిరంగ వేదికపై, అట్టహాసంగా నిర్వహిస్తోంది. 2019లో ఎన్నికల వల్ల ప్రత్యేకంగా మహానాడు నిర్వహించలేదు. 2020, 2021ల్లో కొవిడ్‌ ఉద్ధృతంగా ఉండటం వల్ల ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించారు. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ నాయకత్వం, కేడర్‌ ఉత్సాహంగా ఉంది.

శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధమని తెదేపా అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. పార్టీ కేడర్‌నూ సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దీటుగా ఎదుర్కొనేలా, పార్టీ కేడర్‌ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఇప్పుడు మహానాడు జరగనుంది. తెదేపా ఆవిర్భావం తర్వాత ఇప్పుడు మూడోతరం రాజకీయాల్లోకి వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ల అనుభవాన్ని, కొత్తతరం ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ... మరో కొన్ని దశాబ్దాలపాటు పార్టీ బలంగా నిలదొక్కునేలా పటిష్ఠం చేయాలన్న ఉద్దేశంతో అధినేత చంద్రబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మహానాడు నిర్వహణలోను యువతరానికి కీలక బాధ్యతలు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.