జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్డీసీ) ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో.. అదే హోదాలో, యథాతథంగా కొనసాగిస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్హెచ్డీసీ కార్యాలయాన్ని ఉప కార్యాలయంగా మార్చి విజయవాడలోని బ్రాంచి కార్యాలయానికి అనుసంధానం చేయడంపై ‘ఈనాడు’ గురువారం ‘నేతన్నలకు కేంద్రం షాక్’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి శనివారం స్మృతిఇరానీని కలిసి చర్చించారు.
హైదరాబాద్ కార్యాలయం హోదా తగ్గింపు వల్ల తెలంగాణలో చేనేత రంగ కార్యకలాపాల మీద వ్యతిరేక ప్రభావం పడుతుందని వివరించారు. ఆయన లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించిన స్మృతిఇరానీ.. హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆందోళనను వెంటనే పరిష్కరించినందుకు ఆమెకు కిషన్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్ కూడా కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి శనివారం కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ను కలిశారు. తెలంగాణలోని వివిధ పర్యాటక, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధిపై చర్చించారు. ఆయా అంశాలపై వినతిపత్రం అందజేశారు.