ETV Bharat / city

Dengue Cases in Hyderabad : డెంగీ కేసులపై ఎవరి లెక్కలు వాళ్లవే..

author img

By

Published : Jul 29, 2022, 12:34 PM IST

Dengue Cases in Hyderabad
Dengue Cases in Hyderabad

Dengue fever Cases in Hyderabad : వరుస వర్షాలతో హైదరాబాద్ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. వరద ఉద్ధృతితో నీటి నిల్వలు పెరిగిపోయి.. ఇళ్లలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా డెందీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతోంటే.. జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు మాత్రం తప్పుడు లెక్కలతో అసలైన రోగులను లెక్కలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Dengue fever Cases in Hyderabad : వరుస వానలతో నీటి నిల్వలు పెరిగిపోయి.. ఇళ్లలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి కారణంగా ప్రమాదకర డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు నిర్లక్ష్యం వీడట్లేదు. జిల్లా మలేరియా అధికారుల లెక్కలకు, జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ విభాగం గణాంకాలకు పొంతన ఉండట్లేదు. ఫలితంగా.. ఒక ఇంట్లో.. ఒకరితో మొదలైన డెంగీ జ్వరం.. ఇంట్లోని అందరినీ తాకుతోంది. డెంగీ బాధితులను ఆరంభంలోని గుర్తించి.. ఆ ఇంటితోపాటు చుట్టూ వంద ఇళ్లలో డెంగీ దోమను అంతం చేసే మందు చల్లాలి. సమన్వయం లేకపోవడంతో.. డెంగీ వ్యాధిగ్రస్తుల వివరాలు బల్దియాకు పూర్తిస్థాయిలో అందట్లేదు. దాని వల్ల దోమల నివారణ చర్యలు సాధ్యపడట్లేదు.

గతేడాదికన్నా తీవ్రం.. గతేడాది జులై నెలాఖరు వరకు 130 డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఇప్పటికే 596 కేసులు నమోదయ్యాయి. గతేడాదిలో మొత్తం 1559 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య మూడు రెట్లకుపైగా ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.

సిబ్బందికి బయటి పనులు.. నగరంలో ఫాగింగ్‌ కోసం 18 యూనిట్లు పని చేస్తున్నాయి. ఒక్కో యూనిట్‌లో 19 మంది ఉంటారు. అందులో ఒకరు సూపర్‌వైజరు. దోమల మందును పిచికారి చేసే బృందాలు 107 ఉన్నాయి. ఒక్కో బృందంలో 19 మంది ఉంటారు. మొత్తంగా దోమల నివారణ విభాగంలో 2,500ల మంది సిబ్బంది ఉంటే.. అందులో సగం మంది కూడా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఫాగింగ్‌ కోసం ఇచ్చే డీజిల్‌, పెట్రోలును కొందరు సిబ్బంది అమ్ముతుండగా, ఇంటింటికి తిరిగి మందు చల్లాల్సిన సిబ్బందేమో.. ఇంటి గోడపై సంతకాలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పైగా.. ఉన్న అరకొర సిబ్బందిని కేంద్ర కార్యాలయం ఇతర అవసరాలకు మళ్లించింది. రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు దోమల విభాగం కార్మికులను ఉపయోగించుకుంటోంది.

సద్వినియోగం చేసుకోండి.. ఫాగింగ్‌ కోసం పని చేసే వందలాది మంది సిబ్బందిని బల్దియా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఫాగింగ్‌ లేనందున, ఆ విభాగానికి చెందిన సిబ్బంది ఖాళీగా ఉంటారని, వాళ్లని ఇంటింటికి తిరిగి దోమల మందు పిచికారీకి ఉపయోగించుకోవాలని పౌరులు కోరుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి, సర్కిళ్ల సీనియర్‌ ఎంటమాలజిస్టులకు, ఉన్నతాధికారులకు సమన్వయం లేదు.

దోమల తీవ్రత ఇలా..

దోమలు విపరీతంగా ఉండే కాలనీలు 350

నగరవ్యాప్తంగా కుంటల మాదిరి దర్శనమిస్తూ ఖాళీగా ఉంటున్న ప్రాంతాలు.. 500

కాలనీల్లోని అతి ప్రమాదకర ప్రాంతాలు 35వేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.