ETV Bharat / city

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన

author img

By

Published : Nov 4, 2020, 7:06 AM IST

అప్పటి దాకా ఉపాధి నిచ్చిన ఆటో లాక్‌డౌన్‌ దెబ్బకు ఆగిపోయింది.. పల్లెకొచ్చి వ్యవసాయం ప్రారంభించిన ఆ యువకుడికి వర్షాలు మిగిల్చిన నష్టం అక్షరాలా రూ.6 లక్షలకు పైనే..గత మార్చిలో వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయి ఎన్నో ఆశలతో ప్రస్తుత వానాకాలంలో వరి సాగుచేసిన ఓ అన్నదాత చేనును చెరువు ముంచేసింది. ఇప్పటీకీ నీటిలోనే మునిగిఉన్న పైరుపై ఇక ఆశలు వదిలేసుకున్నారు..వీరిద్దరే కాదు.. రాష్ట్రంలో భారీ వర్షాలకు పూర్తిగా ‘మునిగిపోయిన’ బాధిత రైతులెందరో.. అతివృష్టి మిగిల్చిన అగాథంపై వారిని కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు..

farmers loss due to heavy rains in telangana
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన

కాలంలో పలకరించి అన్నదాతలకు ఆశలు కల్పించిన వర్షాలు.. ఆఖరున ఉగ్రరూపం దాల్చి ఆవేదన మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు అధిక వర్షాలకు కళ్లముందే నల్లబడి, పూత, కాత రాలి నాశనమైపోతుంటే నిస్సహాయ స్థితిలో అప్పులే మిగిలాయంటూ రైతన్న బోరుమంటున్నాడు. మొన్నటివరకు పొలాల్లో ఉప్పొంగిన వరద.. నేడు రైతుల కళ్లలో నుంచి ఉబికి వస్తోంది. పంట నష్టాలపై పలు జిల్లాల్లో ‘ఈనాడు’ పరిశీలన జరపగా.. రైతుల తీవ్ర ఆవేదనతో కష్టాలను చెప్పుకొచ్చారు. ప్రభుత్వమే ఏదోలా ఆదుకుంటుందనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. వరి కంకులు రోజుల తరబడి నీళ్లలో నానడంతో తాలు గింజలు అధికంగా ఉన్నాయి. పత్తికాయలు వర్షపునీటికి నల్లబడటంతో కాటుకపట్టిన దూది వస్తోంది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్తే రూ.2 వేల నుంచి 3 వేలు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

ఇంకా నీటిలోనే..

కొన్ని ప్రాంతాల్లో కూలీ ఖర్చులు వృథా అని పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురిసిన కుంభవృష్టితో పలు ప్రాంతాల్లో పంటల నష్టం తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, కాల్వలు, నదుల పక్కనున్న వందలాది ఎకరాలు నీటమునిగి చాలా వరకూ నాశనమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటిలోనే పంటలున్నాయంటే వర్షాలు మిగిల్చిన నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. కానీ, చాలా ప్రాంతాల్లో అధిక వర్షాలతో పైర్లు తెగుళ్ల బారిన పడి పూత, కాత రాలిపోయాయి. వాటి నుంచి దిగుబడి సగమైనా వచ్చే పరిస్థితి లేదు.

ఆటో నడుపుకొన్నా బాగుండేది...

యువరైతు మురళీకృష్ణ గత మార్చి వరకూ ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించేవారు. లాక్‌డౌన్‌తో ఆ ఉపాధి పోవడంతో స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దకాపర్తికి వచ్చి 14 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి సాగుచేశారు. పక్కనే చెరువు ఉండటంతో వర్షాలకు అది కాస్తా పొంగి పొలం పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటికీ వరదనీటిలోనే వరి పైరు ఉంది. రూ.6 లక్షలు అప్పు తెచ్చి పెట్టి పూర్తిగా మునిగిపోయానని.. ఏం చేయాలో దిక్కుతోచడం లేదని, ఆటో నడుపుకొన్నా నయంగా ఉండేదేమోనని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

కూలీలకు సొమ్ము ఇవ్వలేక..

తంలో పాడి పశువులను మేపుకొంటూ కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఈ వానాకాలంలో తొలిసారి మాకున్న 3 ఎకరాల్లో పత్తి సాగుచేశాం. చెరువు నీరు పొంగి పంట నాశనమైంది. కొద్దిమేర పంట ఇంకా నీటిలో ఉంది.. అందులో అక్కడక్కడా వచ్చిన దూదిని తీయడానికి కూలీలకు సొమ్ము ఇవ్వలేక మేమే తీస్తున్నాం. పాఠశాలలు లేకపోవడంతో 9వ తరగతి చదివే కుమార్తెతో కలిసి నేనే దూది ఏరుతున్నా. - బైకాని భాగ్య, బోగారం, నల్గొండ జిల్లా

అప్పులే మిగిలాయి

మాకున్న 4 ఎకరాల్లో వరి, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశా. వరదల్లో పత్తి చేను మునిగిపోయి కాయలు నల్లబడి నాణ్యతలేని దూది వచ్చింది. దాన్ని ఆరబెట్టి అమ్మితే పెట్టుబడిలో సగమైనా వచ్చేలా లేదు. వరి పొలం కూడా వరదలో మునిగింది. పెట్టుబడులు రాక అప్పులే మిగిలాయి. -ఆరె రేణుక, పోచన్నపేట, జనగామ జిల్లా

ప్రభుత్వం ఆదుకోవాలి

నిమిది ఎకరాలలో పత్తి సాగుచేశా. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట ఎదుగుదల లేక, పూత, పిందె రాలిపోయాయి. ఇదివరకే ఎకరాకు 20 వేల వరకు ఖర్చు చేశాను. పగిలిన పత్తి కూడా మొలకెత్తి, రంగుమారింది. గత్యంతరం లేక చేనును పశువులకు వదిలేశా. ప్రభుత్వం ఆదుకోవాలి. -ప్రహ్లాద్‌రెడ్డి, మంగనూరు, నాగర్‌కర్నూల్‌ జిల్లా

అప్పులు తీరే మార్గమేదీ?

మూడు ఎకరాల్లో పసుపు, మిరప, వరి, పత్తి సాగు చేశా. పసుపునకు రూ.15 వేలు, వరికి రూ.15 వేలు, పత్తికి రూ.20 వేలు, మిరపకు రూ.30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టా. వరి నేలకొరిగింది. పత్తిలో కాయలు వచ్చినప్పటికీ వర్షాలతో నల్లబడి ఎదుగుదల లేకుండా పోయింది. నెలలు గడిచినప్పటికీ మిరప పూత, కాత లేవు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయాం. మా అప్పులు తీరే మార్గం కనిపించడం లేదు. - భూక్య శంకర్‌, హనుమాన్‌నగర్‌ తండా, మహబూబాబాద్‌ జిల్లా

పెట్టుబడులు రాని దుస్థితి

సొంతంగా ఆరెకరాల భూమి ఉంది. మరో నలుగురి వద్ద 24 ఎకరాల వర్షాధార భూమిని కౌలుకు తీసుకున్నా. సోయా 5, వరి 6, పత్తి 19 ఎకరాల్లో వేశాను. సోయా ఎకరాకు మూడు క్వింటాళ్ల చొప్పునే దిగుబడి వచ్చింది. కాయ మురిగిపోయి పత్తి పంట దెబ్బతిన్నది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లు మాత్రమే పత్తి వచ్చింది. మొత్తం రూ.7.16 లక్షల పెట్టుబడి పెట్టా. అవీ తిరిగొచ్చే పరిస్థితి లేదు. - మారుతి పటేల్‌, ఇలేగాం గ్రామం, నిర్మల్‌ జిల్లా

రూ.6 లక్షల నష్టం

నాకు సొంతంగా ఉన్న 10 ఎకరాలతోపాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను. అందులో 11 ఎకరాలు పత్తి, ఎకరం వరి, మరో ఎకరం చెరకు పంట వేశా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దూది అంతా నల్లగా మారింది. ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదు. రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా.. రూ.6 లక్షల పంట నష్టం జరిగింది. -ఫిరంగి రాములు, ఏటిగడ్డ సంఘం, సంగారెడ్డి జిల్లా

ఇవీ చూడండి: దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.