ETV Bharat / city

చిన్నారులపై కరోనా పడగ.. అప్రమత్తతే ఆయుధమని సూచన

author img

By

Published : Mar 20, 2021, 3:59 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తాజాగా 364 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. రోజురోజుకు లక్షణాలు లేని కరోనా కేసులు పెరగడం పట్ల ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Asymptomatic corona cases are raising everyday in Telangana
చిన్నారులపై కరోనా పడగ

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 364 మంది మహమ్మారి బారిన పడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన రెండు నెలల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో రోజుకు రెండు వందలు దాటని కేసులు ఇప్పుడు ఏకంగా మూడొందల పైచిలుకే నమోదవుతున్నాయి. మరో వైపు కొవిడ్ బారిన పడుతున్న వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవటం ఆందోళన కలిగిస్తున్న విషయం. రోజురోజుకు అసింప్టమాటిక్ కేసులు పెరగటం పట్ల వైద్య,ఆరోగ్య శాఖ ఆందోళ వ్యక్తం చేస్తోంది.

కోరలు చాస్తోంది

సరిగ్గా ఏడాది క్రితం ఇదే మార్చి నెలలో కొవిడ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేసినా, ఐసోలేషన్​లు ఏర్పాటు చేసినా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోయాం. ఒక్కటిగా మొదలైన కరోనా కేసులు నిత్యం పదులు, వందలు, వేల నుంచి ఏకంగా లక్షల్లో నమోదయ్యాయి. కంటైన్మెంట్​లు, లాక్​డౌన్​లతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా.. మళ్లీ కరోనా కోరలు చాస్తోంది.

చిన్నారులపై పంజా

ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. తొలినాళ్లలో జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస ఇబ్బందులు ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారు. ఇప్పుడు లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఆ పరిస్థితి లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొవిడ్ సోకిన సుమారు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవడం వల్ల ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది.

90 శాతం అసింప్టమాటిక్ కరోనా

గతంలోనూ ఎలాంటి లక్షణాలు లేని వారు కరోనా బారిన పడేవారు. అయితే అది 70 శాతంగా ఉన్నా.. ఇప్పుడది కాస్తా 90 శాతానికి పెరిగింది. ఫలితంగా లక్షణాలు లేని వారు తమకేం వ్యాధి సోకలేదని భావించం తద్వారా ఇతరులకు వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం పెరిగిందని డీహెచ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

పాఠశాలలపై పడగ

కరోనా మహమ్మారి ముఖ్యంగా పాఠశాలల్లో పడగవిప్పుతున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వైరస్ సోకిన వారిలో 9.03 శాతం మంది 11 నుంచి 20 ఏళ్ల మధ్య వారే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు పాఠశాలల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు మహమ్మారి సోకగా.. అనేక పాఠశాలల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి.

బళ్లోనే ఐసోలేషన్

కరీంనగర్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలు, ఉస్మానియా వర్సిటీలోని విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వ రెసిడెన్షిల్ పాఠశాలల విద్యార్థులను ఆయా హాస్టళ్లలోనే ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అవసరమైన వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

సరిహద్దుల్లో కట్టడి

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ మేరకు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కరోనా నిర్ధారణపరీక్షలు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది.

అప్రమత్తతే ఆయుధం

లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాపిస్తుండం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్కులు , శానిటైజర్లను తప్పని సరిగా వినియోగించాలని కోరుతోంది. లక్షణాలు లేని వారిలో వైరస్ లేదన్న నమ్మకం లేదని అందరూ భౌతిక దూరం పాటించడం తోపాటు.. సమూహాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.