ETV Bharat / business

కొత్తగా 1,120 విమానాలకు ఆర్డర్స్- దేశీయ ఎయిర్​లైన్స్ దూకుడు- ఆకాశ ఎయిర్ తగ్గేదేలే!

author img

By PTI

Published : Jan 18, 2024, 3:23 PM IST

India Airlines Plane Orders
India Airlines Plane Orders

India Airlines Plane Orders : దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాల విస్తరణ కోసం 150 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఏడాది వ్యవధిలో భారతీయ ఎయిర్​లైన్ల నుంచి 1120 విమానాల కోసం ఆర్డర్లు వెళ్లినట్లైంది. ఇప్పటికే ఎయిర్​ఇండియా, ఇండిగో ఎయిర్​లైన్లు భారీగా విమానాల ఆర్డర్లు ఇచ్చాయి.

India Airlines Plane Orders : దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్​క్రాఫ్ట్​ల కోసం భారీ ఆర్డర్లు ఇస్తున్నాయి. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి కంపెనీలు ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వగా- రెండేళ్ల క్రితం మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ ఎయిర్ సైతం తన కార్యకలాపాల విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 150 బోయింగ్ విమానాల కోసం ఆకాశ ఎయిర్ ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో బోయింగ్ '737 మ్యాక్స్ 10', బోయింగ్ '737 మ్యాక్స్8-200' విమానాలు ఉండనున్నాయి.

ఆకాశ ఎయిర్​తో కలిపి ఏడాది వ్యవధిలో భారత్ నుంచి ఇప్పటి వరకు 1120 విమానాల కోసం ఆర్డర్లు వెళ్లినట్లైంది. 2023లో ఎయిర్​ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు 970 బోయింగ్, ఎయిర్​బస్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ఇండియా మొత్తం 470 ప్లేన్​లకు గతేడాది ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో 250 విమానాలను ఎయిర్​బస్ నుంచి మరో 220 ఎయిర్​క్రాఫ్ట్​లను బోయింగ్ నుంచి సమీకరిస్తోంది. దేశీయ అతిపెద్ద ఎయిర్​లైన్ అయిన ఇండిగో సైతం గతేడాది జూన్​లో భారీగా విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఎయిర్​బస్ నుంచి 500 న్యారో-బాడీ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది.

1600 విమానాల డెలివరీ!
వీటితో పాటు, ఈ సంస్థలు ఇదివరకే ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన విమానాల డెలివరీ సైతం త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంస్థ మొత్తంగా వెయ్యి వరకు విమానాలకు ఆర్డర్లు ఇచ్చింది. గతేడాది మే నెలలో కార్యకలాపాలు నిలిపివేసిన గో-ఫస్ట్ ఎయిర్​లైన్ సైతం 72 విమానాలకు గతంలోనే ఆర్డర్ ఇచ్చింది. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ఎయిర్​లైన్ సంస్థలన్నీ కలిపి 1600కు పైగా విమానాల డెలివరీలు స్వీకరించనున్నాయి.

ప్రస్తుతం ఉన్న విమానాలు ఎన్నంటే?
కొన్నేళ్లుగా దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్​గా భారత్ నిలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్​లైన్ల వద్ద 730 విమానాలు మాత్రమే ఉన్నాయి. 2030 నాటికి ఈ సంస్థల వద్ద ఉండే విమానాల సంఖ్య 1500 నుంచి 2000కు చేరే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అంచనా వేశారు.

విమానంలో ఫ్రీగా ప్రయాణించాలా? క్రెడిట్​ కార్డ్​ రివార్డ్​ పాయింట్స్​తో ఇలా చేయండి!

విదేశాల్లోనూ గూగుల్​ పే సేవలు- తగ్గనున్న ఛార్జీల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.