ETV Bharat / bharat

నాలుగో దశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం.. బరిలో 624 మంది

author img

By

Published : Feb 22, 2022, 10:43 PM IST

UP Polls
ఉత్తర్​ప్రేద్​ శాసన సభ ఎన్నికలు

UP polls: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌కు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు బుధవారం ఓటింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ పార్లమెంటు స్థానం పరిధిలో గత ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈసారి భాజపా తరఫున పోటీలో ఉన్నారు. ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్‌ సింగ్‌ కమలం తరఫున బరిలో నిలిచారు.

UP polls: ఉత్తరప్రదేశ్‌ శాసనసభ నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్న 59 నియోజకవర్గాల్లో బుధవారం ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లఖ్‌నవూ జిల్లాతోపాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే ఓటింగ్‌ జరగనుంది. జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

  • 2017లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి.
  • ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్‌సింగ్‌ లఖ్‌నవూ జిల్లా సరోజినీనగర్‌ స్థానం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు.
  • న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌, మరోమంత్రి అశుతోష్‌ టాండన్‌ లఖ్‌నవూ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు.
  • కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాయ్‌బరేలీ సదర్‌, హర్‌చంద్‌పుర్‌, ఊంచాహార్‌, సరేనీ, బఛ్రావా అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు గెలిచారు. ఆ తర్వాత వారు కూడా భాజపాలో చేరారు. రాయ్‌బరేలీసదర్‌, హర్‌చంద్‌పుర్‌లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన అదితిసింగ్‌, రాకేశ్‌సింగ్‌ ఈసారి అవే స్థానాల్లో కమలం టికెట్‌పై పోటీచేస్తున్నారు.

విద్యాకేంద్రంగా పేరొందిన లఖ్‌నవూ ఉత్తర స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నీరజ్‌ బోరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు పూజాశుక్లాను ఎస్పీ బరిలో దింపింది. మొత్తం ఏడు విడతల్లో ఓటింగ్‌ జరగనుండగా ఇప్పటి వరకు పోలింగ్‌ జరిగిన మూడువిడతల్లో తమదే ఆధిక్యమని భాజపా, ఎస్పీలు ధీమా వ్యక్తం చేశాయి.

ఎన్నికలు జరిగే స్థానాలు : 59

బరిలో నిలిచిన అభ్యర్థులు : 629

ఎన్నికలు జరగనున్న జిల్లాలు : పీలీభీత్​, లఖింపుర్​ ఖేరీ, సీతాపుర్​, హర్దోయ్​, ఉన్నావ్​, లఖ్​నవూ, రాయ్​ బరేలీ, బాందా, ఫతేపుర్​.

బరిలో ప్రముఖులు : బ్రిజేశ్​ పాఠక్​(యూపీ న్యాయశాఖ మంత్రి), అశుతోశ్​ టాండన్​(యూపీ మంత్రి), నితిన్​ అగర్వాల్​(యూపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​), రాజేశ్వర్​ సింగ్​(ఈడీ మాజీ అధికారి)

ఫలితాలు : మార్చి 10

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.

ఇదీ చూడండి: ఎలక్షన్ డ్యూటీలో మళ్లీ మెరిసిన 'రీనా'.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.