ETV Bharat / bharat

మావోయిస్టు ముఖ్యులపై మృత్యుఘాతం

author img

By

Published : Nov 15, 2021, 6:34 AM IST

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్​కౌంటర్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో 16 మృతదేహాలను గుర్తించారు అధికారులు. కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డేను కూడా మృతుడిగా గుర్తించారు. మృతదేహాలను ఆదివారం తెల్లవారుజామున గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు.

encounter
ఎన్​కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే ఒకరని ధ్రువపడింది. శనివారం నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయినవారి సాయంతో మృతుల్లో 16 మందిని గుర్తించారు. మృతదేహాలను ఆదివారం తెల్లవారుజామున గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. తేల్‌తుంబ్డేపై రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని తమ శాఖ ప్రకటించిందని పోలీసు అధికారులు తెలిపారు. అతడి కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలు గత కొన్నేళ్లుగా గాలిస్తున్నాయి. అతడికి అంగరక్షకులుగా ఉన్న ఒక స్త్రీ, మరో పురుషుడు కూడా తాజా కాల్పుల్లో చనిపోయారు. ఉద్యమకారుడు ఆనంద్‌ తేల్‌తుంబ్డేకు మిలింద్‌ సోదరుడు. మావోయిస్టుల కమాండర్‌గా ఉన్న లోకేశ్‌ అలియాస్‌ మంగు పొండ్యం (రూ.20 లక్షల రివార్డు), కస్నాసుర్‌ దళం డివిజనల్‌ కమిటీ సభ్యుడు మహేశ్‌ అలియాస్‌ శివాజీరావోజీ గోతా (రూ.16 లక్షల రివార్డు) సహా 26 మందిపై కలిపి రూ.1.39 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

tel tumbde
తేల్​ తుంబ్డే

కమాండోలపై గుళ్ల వర్షం

గాలింపు చర్యల్లో పాల్గొన్న సి-60 కమాండోలు, జవాన్లపై దాదాపు 100 మంది వరకు మావోయిస్టులు అధునాతన ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించారనీ, లొంగిపోవాల్సిందిగా చేసిన హెచ్చరికల్ని బేఖాతరు చేశారనీ గడ్చిరోలి రేంజి డీఐజీ సందీప్‌ పాటిల్‌ విలేకరులకు తెలిపారు. ఉద్యమాన్ని విస్తరించడంలో తేల్‌తుంబ్డేది కీలక పాత్ర అనీ, అతడి మరణంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పారు. ఘటనా స్థలంలో ఐదు ఏకే-47 తుపాకులు సహా 29 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్‌ గోయల్‌ తెలిపారు. మృతిచెందిన వారిలో తెలుగు రాష్ట్రాల మావోయిస్టులెవరూ లేరని ప్రకటించారు. 'ఎల్‌పీజీఏ వారోత్సవాల సందర్భంగా భారీ విధ్వంసం సృష్టించేందుకు గ్యార్‌పట్టి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారు. సమాచారం తెలిసిన బలగాలు కూంబింగ్‌ ప్రారంభించాయి. ఉదయం 9.30కి పోలీసులపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు' అని వివరించారు.

guns
స్వాధీనం చేసుకున్న తుపాకులు

సింగరేణి కార్మికుడి నుంచి మావోయిస్టు సీసీఎంగా..

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మిలింద్‌ తేల్‌తుంబ్డే సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మావోయిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడి(సీసీఎం) స్థాయికి ఎదిగాడు. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వణి తాలూకా రాజూర్‌ గ్రామానికి చెందిన అతడు ఐటీఐ చేసి 1984-85లో ధూప్‌తాలా ఓపెన్‌కాస్ట్‌ కోల్‌మైన్స్‌లో ఎలక్ట్రీషియన్‌గా చేరాడు. నక్సలైట్‌ పార్టీలో చేరాక చంద్రాపుర్‌, నాగ్‌పుర్‌, ఉమ్రేడ్‌, వని కోల్‌బెల్ట్‌ ఏరియా డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2004-05లో మహారాష్ట్ర రాజ్య రాష్ట్ర కమిటీ(ఎంఆర్‌ఎస్‌సీ) సభ్యుడిగా, అనంతరం రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 2013 మార్చిలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. 2016-17లో ఎంఆర్‌ఎస్‌సీని రద్దు చేసి ఎంఎంసీ జోన్‌ను ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నాడు. తేల్‌తుంబ్డేకు 63 ఘటనల్లో ప్రమేయముందని పోలీసులు తెలిపారు. వీటిలో 42 ఎన్‌కౌంటర్లు, 11 హత్యలు ఉన్నాయి. 2019లో జంబుల్కేడలో చోటుచేసుకున్న పేలుడులో 15 మంది పోలీసులు మృతి చెందిన ఘటనలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు.

సంచలనం సృష్టించిన భీమా-కోరేగావ్‌ కేసులోనూ ఇతడి ప్రమేయమున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అభియోగాలు మోపింది. గ్యార్‌పట్టిలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ ఆదివారం స్థానిక విలేకరులకు పంపిన లేఖలో డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'తేల్​తుంబ్డే మరణం.. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ'

'గడ్చిరోలి'​ మృతుల్లో నక్సల్​ టాప్​ కమాండర్​ తుంబ్డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.