ETV Bharat / bharat

'గడ్చిరోలి'​ మృతుల్లో నక్సల్​ టాప్​ కమాండర్​ తుంబ్డే

author img

By

Published : Nov 14, 2021, 4:51 AM IST

Updated : Nov 14, 2021, 11:26 AM IST

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల(gadchiroli encounter) మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్​ తేల్​తుంబ్డే సహా.. మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలిపారు.

naxals
నక్సల్స్

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో(gadchiroli encounter) కనీసం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్​ గోయల్​ తెలిపారు. కోరేగావ్‌ భీమా-మావోయిస్టుల సంబంధాల కేసులో బలగాలు వెతుకుతున్న నిందితుల్లో తేల్‌తుంబ్డే ఒకరని తెలిపారు.

Milind telthumbde
కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే

మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే పాటిల్​ సైతం మిలింద్​ తేల్​తుంబ్డే మరణించినట్లు వెల్లడించారు. 'నిన్న జరిగిన గడ్చిరోలి ఎన్​కౌంటర్​లో(gadchiroli encounter today) 26 మంది మరణించారు. అందులో 20 మంది పురుషులు, ఆరుగులు ఆడవాళ్లు ఉన్నారు. మరణించిన వారిలో భీమా కోరేగావ్​ కేసులో నిందితుడు, నక్సల్​ కమాండర్​ మిలింద్​ తేల్​తుంబ్డే ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ధ్రువీకరించారు. కూంబింగ్​ కొనసాగుతోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారిని గుర్తిస్తున్నారు.' అని తెలిపారు.

ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును ఆనుకుని ఉండే గడ్చిరోలి జిల్లాలో గ్యార్‌పట్టి అడవుల్లో మావోయిస్టు ఏరివేత(Naxals encounter) చర్యల్ని సి-60 కమాండోలు పెద్దఎత్తున చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి, వారిపై కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. సి-60 దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో కనీసం 26మంది మృతి చెందగా కొందరు మాత్రం అడవిలోకి పారిపోయారని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉండడంతో అక్కడకు చేరుకోవడమూ క్లిష్టతరంగా మారింది. ఘటన స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినవారి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎదురుకాల్పుల్లో గాయపడిన నలుగురు జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్లో నాగ్‌పుర్‌కు తరలించారు.

సి-60 ప్రత్యేకత ఇదీ..

మావోయిస్టులకు పెద్దఎత్తున నష్టం కలిగించిన సి-60 దళం 1992లో ఏర్పాటైంది. మొదట దీనిలో 60 మంది పోలీసులు ఉండేవారు. అప్పటి గడ్చిరోలి ఎస్పీ కె.పి.రఘువంశీకి వచ్చిన ఆలోచన మేరకు ఆయన నేతృత్వంలోనే ఇది ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌తో పాటు హజారీబాగ్‌ (బిహార్‌), నాగ్‌పుర్‌లలో ఉన్న శిక్షణ సంస్థల నిపుణుల పర్యవేక్షణలో బలగం రాటుదేలింది. మావోయిస్టులపై పోరుకు స్థానిక గిరిజన ప్రజలనే వాడుకోవడం సి-60 దళాలతో మొదలైంది. గెరిల్లా పోరాట రీతులు సహా వివిధ రూపాల్లో వీరికి శిక్షణ ఇస్తారు.స్థానికులతో స్థానిక భాషలో మాట్లాడగలగడం, అక్కడి భౌగోళిక స్వరూపంపై పూర్తి అవగాహన ఉండడం వల్ల ఈ దళాలు వేగంగా చొచ్చుకుపోతుంటాయి. .

పీఎల్‌జీఏ వారోత్సవాలపై చర్చించేందుకేనా..

మావోయిస్టులు గడ్చిరోలిలో భారీగా శిబిరం నిర్వహించడంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం దళాలు సంచరించడం మాత్రమే తెలుసు. ఒక్కో దళంలో పది మంది వరకే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో అలా కాదు. సాధారణంగా అక్కడ ప్లటూన్లుగా సంచరిస్తుంటారు. ఆ ప్లటూన్లలో 40-50 మంది వరకు ఉంటారు. మావోయిస్టు పార్టీ ఏటా డిసెంబరు 2 నుంచి వారం పాటు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహిస్తుంటుంది. వాటిపై చర్చించేందుకే శిబిరం ఏర్పాటు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఎదురుకాల్పులు సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగాయి. మృతుల్లో మావోయిస్టు గడ్చిరోలి డివిజనల్‌ కమిటీ సభ్యుడు శుక్లాల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణవాసి పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన అడవుల్లోనే ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేస్తున్నారు.

అత్యంత సున్నితం.. గ్యార్‌పట్టి

ఛత్తీస్‌గఢ్‌లోని మొహల్లా జిల్లాకు ఆనుకుని ఉండే జిల్లా గడ్చిరోలి. దీనిలో ఒకటైన గ్యార్‌పట్టి పోలీసు స్టేషన్‌.. మావోయిస్టుల కార్యకలాపాల పరంగా అత్యంత సున్నితమైనది. ఎత్తైన కొండలు, దట్టమైన కీకారణ్యం నడుమ ఇది ఉండడమే కారణం. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ మొహల్లాలో, ఇటు గడ్చిరోలిలో మావోల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం నుంచే భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. శనివారం మావోలు, బలగాలు పరస్పరం తారసపడినప్పుడు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

వరుసదెబ్బలు.. దూరమైన కీలక నేతలు

మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత నెల 14న కేంద్ర కమిటీసభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అనారోగ్యంతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌బోస్‌ అలియాస్‌ కిషన్‌దా చికిత్స కోసం అడవులు దాటి బయటికి వచ్చి పోలీసులకు దొరికిపోయారు. మావోయిస్టుల వాహనం వస్తోందనే సమాచారంతో తనిఖీలు చేపట్టగా అనూహ్యంగా ఆయన చిక్కడం పోలీసులకు గొప్ప విజయంగా భావిస్తున్నారు. ఆయనతోపాటు చిక్కిన ఆయన భార్య హేమ కూడా కేంద్రకమిటీ సభ్యురాలే. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న ఏకైక మహిళా కేంద్రకమిటీ సభ్యురాలు ఆమె. 75 ఏళ్ల వయసులోనూ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రశాంత్‌బోస్‌ మావోయిస్టు పార్టీలో నంబర్‌ 2 హోదాలో ఉన్నారు. పార్టీలోని ఉత్తరాది- దక్షిణాది నేతలకు వారధిగాఉన్న ఆయన పట్టుబడటం మావోయిస్టులకు విఘాతంగా మారింది.

నాడు 42 మంది.. నేడు 26 మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార్‌పట్టి అటవీప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ మావోయిస్టుల చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన. ఈ ఉదంతం 2018నాటి కసన్‌సూర్‌ ఎన్‌కౌంటర్‌ను తలపించింది. అప్పట్లో వరుసగా చోటుచేసుకున్న రెండు ఎన్‌కౌంటర్‌లలో ఏకంగా 42 మంది చనిపోయారు. అదే మావోయిస్టులకు అతిపెద్ద ఎదురుదెబ్బ. 2018 ఏప్రిల్‌ 22న గడ్చిరోలి జిల్లా బామ్రాగడ్‌ తాలూకా కసన్‌సూర్‌-బొరియా అటవీప్రాంతంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేశారనే సమాచారంతో సి-60 కమాండో దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు మరణించారు. వీరు మహారాష్ట్రలోని అహెరి, పరిమెలి దళాలకు చెందినవారుగా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా చల్లగరిగెకు చెందిన గడ్చిరోలి డీసీఎం నర్సింహులు మరణించాడు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో తొలుత 23 మంది మావోయిస్టులే చనిపోయారని భావించారు. మరుసటిరోజు ఘటనాస్థలికి సమీపంలోని ఇంద్రావతి నదిలో 11 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. అనంతరం మరో ఆరుగురు మృతుల్ని గుర్తించారు. మొత్తం 40 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే మే నెలలో మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం మృతుల సంఖ్య 42కు చేరింది. అనంతరం అంత తీవ్రస్థాయిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ శనివారం నాటి గ్యారపట్టిదే. 2005లో నిజామాబాద్‌ జిల్లా మానాల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు.

ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ వారున్నారా?

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిని దాటితే గడ్చిరోలి జిల్లాలోని సిరొంచ తాలూకా ప్రారంభమవుతుంది. తెలంగాణకు చెందిన పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన అడవుల్లోనే ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారముంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన స్వామి దాదాపు రెండు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

ఇదీ చదవండి:

ఉగ్రదాడిపై 'ప్రతీకారం' కోసం భారీ కుంబింగ్​ ఆపరేషన్​

Last Updated : Nov 14, 2021, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.