ETV Bharat / bharat

మహిళా ఐపీఎస్​పై కారులో లైంగిక వేధింపులు.. మాజీ ఏడీజీపీకి మూడేళ్ల జైలు శిక్ష

author img

By

Published : Jun 16, 2023, 6:04 PM IST

Tamilnadu Ex IPS Jailed : లైంగిక ఆరోపణల కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్‌ దాస్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆయనకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెలువరించింది.

Tamilnadu Ex IPS Jailed
మాజీ ఐపీఎస్​ అధికారికి మూడేళ్ల జైలు శిక్ష

Tamilnadu Ex IPS Jailed : ఓ మహిళా పోలీసు అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్‌ను స్థానిక విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆయనకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లడమే కాకుండా.. బెయిల్​కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ఇక ఇదే కేసులో అప్పటి చెంగల్‌పట్టు ఎస్పీ కన్నన్‌కు కూడా విల్లుపురం న్యాయస్థానం జరిమానా విధించింది. రాజేశ్ దాస్‌పై ఫిర్యాదు చేయడానికి చెన్నై వెళ్తున్న ఆ మహిళా అధికారిణిని కారును టోల్​ ప్లాజా వద్ద ఎస్పీ కన్నన్‌ అడ్డుకున్నారు. ఆ ఎస్పీపై కూడా సస్పెన్షన్​ వేటు పడింది. ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళను అడ్డుకున్న ఎస్పీ కన్నన్​ను కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో ఆయనను కూడా న్యాయస్థానం దోషిగా తేల్చి.. రూ.500 జరిమానా విధించింది.

ఇదీ జరిగింది..
ఐపీఎస్‌ అధికారి రాజేశ్ దాస్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ.. ఓ మహిళా ఐపీఎస్‌ 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. రాజకీయ నేత పళనిస్వామి సభకు బందోబస్తు నిర్వహించేందుకు తామిద్దరం ఒకే వాహనంలో వెళ్లాల్సి వచ్చిందని.. మార్గమధ్యలో సీనియర్‌ ఐపీఎస్‌ దాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వం.. రాజేశ్ దాస్‌ను సస్పెండ్‌ చేసింది. ఆయనపై విచారణకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల్లో ఈ అంశం తెరపైకి..
మహిళా ఐపీఎస్​ అధికారిణి వేధింపుల అంశం 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న ఎంకే స్టాలిన్​.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారిపై విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా అప్పట్లో మద్రాస్​ హైకోర్టు కూడా ఈ కేసును సీరియస్​గా తీసుకుంది. డీజీపీ స్థాయి వ్యక్తి లైంగిక వేధింపులకు గురి కావడం.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆమెను మరో పోలీసు అధికారి అడ్డుకోవడం బాధకరమని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారుని రీకాల్‌ చేసి క్రాస్‌ఎగ్జామిన్‌ చేయాలని కోరుతూ దాస్​ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్​ను కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో కొట్టివేసింది.

యువకుడిపై పోలీసు అత్యాచారం..
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడిపై అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ పోలీస్ ఇన్​స్పెక్టర్. నిందితుడు సురేంద్ర యాదవ్ మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని లోకాయుక్త బ్రాంచ్​లో పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు పరారయ్యాడని వివరించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.