ETV Bharat / bharat

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కన్నతండ్రిని చంపిన కొడుకు!

author img

By

Published : Dec 4, 2022, 10:11 PM IST

son kills the father
తండ్రిని హతమార్చిన కుమారుడు

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి కన్నతండ్రిని హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

బంగాల్​.. సీతాల్​కుచిలో ఘోరం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన తండ్రినే హతమార్చాడు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన. నిందితుడు మిథున్​, అతడి భార్య సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు కాజల్ షిల్​ శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. అతడి మృతదేహం ఇంటిపైకప్పుకు వేలాడి ఉంది. నిందితుడు.. తండ్రి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఘటనాస్థలిలో సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సుత్తినే నిందితుడు హత్యకు ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

వివాహేతర సంబంధం మోజులో..
వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, సొంత కూతురే ఆమెను పోలీసులకు పట్టించింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కవిత అనే మహిళ స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమెకు అదే ఆస్పత్రిలో ఇన్సూరెన్స్‌ విభాగంలో పని చేస్తున్న వినయ్‌శర్మతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని రాత్రిపూట అతడు నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాను పని చేస్తున్న ఆస్పత్రికే తీసుకెళ్లి.. ఉరివేసుకొని భర్త మృతి చెందినట్లుగా నమ్మించింది.

ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన వైద్యసిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు గొంతుపై గాట్లు ఉన్నట్లు గుర్తించి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అనంతరం 13 ఏళ్ల వయసున్న కవిత కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా.. తన తండ్రిని తల్లే చంపేసిందని, నిద్రిస్తున్న సమయంలో తలపై దిండుతో గట్టిగా అదిమి, అనంతరం గొంతు నులిమేసిందని, కిటికీలోంచి తాను కళ్లారా చూశానని పోలీసులకు చెప్పింది. ఆ సమాచారం మేరకు కవితను పోలీసులు ప్రశ్నించగా.. నేరం అంగీకరించింది. వాట్సాప్‌ చాటింగ్‌ డేటా ప్రకారం.. ఈ హత్యతో ఆమె ప్రియుడు వినయ్‌శర్మకు కూడా సంబంధం ఉందని పోలీసులు నిర్ధరించారు. ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు.

పెదనాన్న హత్య..
పంజాబ్.. అమృత్​సర్​లో దారుణం జరిగింది. పెదనాన్నను పదునైన కత్తితో పొడిచి హతమార్చాడు ఓ యువకుడు. మృతుడిని నరీందర్​ సింగ్​గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు కత్తితో దాడి చేసిన అనంతరం నరీందర్ సింగ్ కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న స్థానికులు నరీందర్ సింగ్ ఇంటికి చేరుకుని నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. అనంతరం నరీందర్ సింగ్​ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కన్న కుమారుడిని..
బిహార్​.. ఔరంగాబాద్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ వితంతువు తన కుమారుడిని చంపి.. మృతదేహాన్ని ఇంటి పెరట్లో పాతిపెట్టింది. రెండు నెలల క్రితం ఆమె కుమార్తె మృతి చెందింది. ఆమెను కూడా నిందితురాలే హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని మారుతీ నందన్‌(15)గా పోలీసులు గుర్తించారు. బాధితురాలి భర్త నాలుగేళ్ల క్రితం మరణించాడు.

వృద్ధురాలి మృతదేహం అల్మారాలో..
మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన వృద్ధురాలు ఓ ఇంటి అల్మారాలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన కర్ణాటక.. బెంగళూరులో జరిగింది. మృతురాలిని పార్వతమ్మ(80)గా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలు కనిపించట్లేదని ఆమె కుమారుడు రమేశ్.. మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులు, ముక్కుపుడక, ఉంగరం కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఆమె నగలు దోచుకుని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.