ETV Bharat / bharat

శిందే నియామకంపై సుప్రీంకు ఉద్ధవ్.. మధ్యంతర ఎన్నికలకు డిమాండ్

author img

By

Published : Jul 8, 2022, 1:08 PM IST

Updated : Jul 8, 2022, 3:37 PM IST

maharashtra politics
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే నియామకాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది ఉద్ధవ్ వర్గం. ఈ వ్యాజ్యంపై ఈ నెల 11న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు శివసేన గుర్తు 'విల్లు- బాణం' తమకే ఉంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే నియామకాన్ని సవాల్‌ చేస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 11న వాదనలు వింటామని.. జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ప్రభుత్వం ఏర్పాటు కోసం శిందే వర్గం, భాజపాను ఆహ్వానిస్తూ గత నెల 30న గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఉద్ధవ్ వర్గం నేతలు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వేసిన పిటిషన్‌లతోపాటు తాజా వ్యాజ్యంపై ఈనెల 11న విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరినట్లు న్యాయవాది దేవదత్‌ కామత్‌ తెలిపారు. ఈనెల 3, 4 తేదీల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు, కొత్త స్పీకర్‌ ఎన్నిక, బలపరీక్షను సవాల్‌ చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంను ఆశ్రయించింది. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహావికాస్‌ ఆఘాఢీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోగా.. సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు.

ఎన్నికలకు వెళ్దాం.. మరోవైపు.. శివసేన గుర్తు 'విల్లు- బాణం' తమకే ఉంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భాజపాతో చేతులు కలిపి తనకు వెన్నుపోటు పొడిచారని ఏక్​నాథ్ శిందేను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. జులై 11న సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పు శివసేన భవిష్యత్తునే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని ఉద్ధవ్ అన్నారు.

రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపా. శాసనసభా పక్షంలో చీలిక ఏర్పడినా.. పార్టీ గుర్తు మాత్రం శివసేనకే ఉంటుంది. శివసైనికులకు భరోసా ఇస్తున్నా.. 'విల్లు-బాణం' గుర్తు మన వద్దే ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతివ్వాలనేది పార్టీ ఎంపీలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. గత రెండేళ్లలో భాజపా నన్ను, నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది. అయినా శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు.

-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

ఇవీ చదవండి: ఝార్ఖండ్​ సీఎం, ఆయన సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

లాలూ ఆరోగ్యంపై తేజస్వీ కీలక ప్రకటన.. ఆ రూమర్స్​ నమ్మొద్దంటూ!

Last Updated :Jul 8, 2022, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.