ETV Bharat / bharat

సముద్రాల భద్రతకు మోదీ 'పంచ సూత్రాలు'

author img

By

Published : Aug 9, 2021, 6:46 PM IST

PM Modi
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో 'సముద్రాల భద్రత- అంతర్జాతీయ సహకారం'పై వర్చువల్​గా జరిగిన చర్చకు అధ్యక్షత వహించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా.. సముద్ర భద్రత కోసం 5 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి, భూమండల భవిష్యత్తుకు సముద్రాలు చాలా కీలకమైనవిగా పేర్కొన్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 'సముద్ర భద్రత బలోపేతం, అంతర్జాతీయ సహకారం'పై వర్చువల్​గా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఐరాస భద్రతా మండలిలో చేపట్టిన బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన భారత తొలి ప్రధానిగా మోదీ నిలిచారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

" అంతర్జాతీయ వాణిజ్యానికి, మన భూమండల భవిష్యత్తుకు సముద్రాలు చాలా కీలకం. సముద్ర వాణిజ్యానికి ఏదైనా ఆటంకం కలిగితే అది గ్లోబల్​​ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రాలు మన భాగస్వామ్య వారసత్వ సంపద. మహా సముద్రాలు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సముద్ర దారులను పైరసీ, ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేస్తున్నారు. చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యంలో అడ్డంకులను తొలగించాలి. వివాదాలు శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సముద్రాల భద్రతకు 5 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు ప్రధాని మోదీ.

  1. స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యంలో ఆడ్డంకులను తొలగిస్తే.. చట్టబద్ధమైన వ్యాపారాన్ని స్థాపించవచ్చు.
  2. వివాదాలు శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పరిష్కరించుకోవాలి.
  3. బాధ్యాతాయుతమైన సముద్రాల అనుసంధానాన్ని ప్రోత్సహించాలి.
  4. సహజ విపత్తులు, విద్రోహ శక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడాలి.
  5. సముద్ర పర్యావరణ, వనరులను సంరక్షించాలి.

సముద్ర జలాల్లో భద్రతపై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్​ పలు చర్యలు చేపట్టిందన్నారు మోదీ. ప్లాస్టిక్​, చమురు లీకేజీలతో ఏర్పడే కాలుష్యం నుంచి సముద్రాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టే మౌలిక ప్రాజేక్టుల నిర్మాణంలో దేశాల సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్​ఏజీఆర్​​(భద్రత సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి) విజన్​తో తమ ప్రాంతంలో సముద్రాల భద్రతపై ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. దీని ద్వారా సముద్రాలు సురక్షితమైనవిగా, భద్రంగా, స్థిరంగా ఉంటాయన్నారు.

ఈ సమావేశానికి ఐరాస భద్రత మండలిలోని సభ్య దేశాల అధినేతలు, ఉన్నతస్థాయి అధికారులు, కీలక ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు వర్చువల్​గా హాజరయ్యారు. బహిరంగ చర్చలో ప్రధానంగా సముద్ర జలాల్లో నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, తీర ప్రాంతాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటంపై చర్చించారు.

ఇదీ చూడండి: మోదీ అధ్యక్షతన సముద్ర భద్రతపై ఐరాసలో చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.