ETV Bharat / bharat

Murder: పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. రాయితో కొట్టి.. సొంత తమ్ముడిని దారుణంగా చంపిన అన్న

author img

By

Published : Apr 16, 2023, 10:07 AM IST

murder
murder

Older Brother killed his Younger Brother: నేటి ఆధునిక సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసిన జనాలు.. నేడు ఆస్తి, అంతస్తులు, డబ్బుకు విలువనిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికి వెనుకంజ వేయడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Older Brother killed his Younger Brother: నేటి సమాజంలో రానురాను కుటుంబ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. తాజాగా కుటుంబ సంబంధాలను ప్రశ్నార్ధకం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత తమ్ముడిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓ అన్న.. ఇంట్లోంచి అతను బయటికి రాకుండా తలుపు వద్ద బండరాయి పెట్టాడు. ప్రాణాలు రక్షించుకోవాలని ఆయన ఎలాగోలా తప్పించుకుని బయటకు వస్తే.. వీధిలో అందరిముందే రాయితో కొట్టి కొట్టి చంపాడు. గ్రామస్థులంతా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఎదురించలేని పరిస్థితి నెలకొంది. సుమారు మూడు గంటల సేపు అన్న ఆ తమ్ముడిని కొడుతూ ఉన్నా.. ఎవరూ వారిని అడ్డుకోకపోగా.. కనీసం పోలీసులకూ సమాచారం అందించలేదు. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే ఇంతటి దారుణానికి తెగబడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలోని 40వ డివిజన్‌ ఉర్సు తాళ్లమండువ ప్రాంతంలో గోవిందుల శ్రీనివాస్‌, శ్రీధర్‌, శ్రీకాంత్‌ అనే ముగ్గురు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తమ తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు సోదరులు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్దవాడైన గోవిందుల శ్రీనివాస్‌ మరణించారు. అయితే చిన్నవాడైన శ్రీకాంత్‌కు వచ్చిన వాటా విషయంలో గొడవపడిన రెండో అన్న శ్రీధర్‌.. ఆ భూమి తనకు ఇవ్వనని, ఇక్కడే ఉంటే చంపుతానని శ్రీకాంత్​ను తీవ్రంగా కొట్టి బెదిరించాడు.

ప్రేమ వివాహం.. అనారోగ్య సమస్యలు : దాంతో గొడవ లెందుకులే అని చిన్నవాడైన శ్రీకాంత్‌ వరంగల్‌ నుంచి ఇల్లు వదిలి, తన తల్లితో కలిసి నిజామాబాద్‌కు వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో అక్కడి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు శ్రీకాంత్. ఇదిలా ఉంటే కరోనా తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. అదే విషయంపై నిజామాబాద్‌ నుంచి సొంతూరు ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా అన్న శ్రీధర్‌ ఎప్పటిలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో ఈ నెల 7న శ్రీకాంత్ మిల్స్‌కాలనీ పోలీస్​ స్టేషన్‌లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు.

వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి వచ్చి.. అనంతలోకాలకు : శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అన్న శ్రీధర్‌ను పీఎస్​కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని పోలీసుల ముందు శ్రీధర్ ఒప్పుకొన్నాడు. దాంతో భూమిని అమ్మడానికి ఇబ్బందిలేదని నమ్మిన శ్రీకాంత్‌.. తన భార్యతో కలిసి వరంగల్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. తన వాటాగా వచ్చిన స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని శ్రీకాంత్ స్థలం వద్దకు వెళ్లగా, వెనక నుంచి వచ్చిన అన్న శ్రీధర్‌.. తమ్ముడు శ్రీకాంత్‌ను కొట్టడంతో స్థలం చూసేందుకు వచ్చిన వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఇల్లొదిలి పారిపోయిన నిందితుడి కుటుంబం: తర్వాత తమ్ముడు శ్రీకాంత్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి గాయపరిచి ఆయనపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు శ్రీధర్. అంతటితో ఆగకుండా శ్రీకాంత్ బయటకు రాకుండా తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. అయితే ఎలాగోలా శ్రీకాంత్‌ ఇంట్లో నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తగా.. వీధిలో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హత్య చేసినట్లు అక్కడి స్థానికులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తమ్ముడు శ్రీకాంత్‌ను కొడుతున్నా.. స్థానికంగా ఉన్న వారెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. మరోవైపు శ్రీధర్‌, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఏసీపీ బోనాల కిషన్‌, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీకాంత్ భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.